Hero MotoCorp నుండి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల ఖరారు, అఫీషియల్ లాంచ్ ఎప్పుడంటే..?
దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అధిక ఇంధన ధరల నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు సరసమైన రోజూవారీ రవాణ కోసం వెతుకుతున్నారు. మార్కెట్లో ఇప్పటికే బజాజ్ (చేతక్ ఈవీ) మరియు టీవీఎస్ (ఐక్యూబ్) వంటి కంపెనీలు తమ ఎలక్ట్రిక్ టూవీలర్లను అందిస్తున్నాయి. కాగా, ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు హీరో మోటోకార్ప్ మరియు హోండా టూవీలర్స్ కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), తమ ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాన్స్ గురించి వెల్లడి చేసింది. త్వరలోనే తాము ఓ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ కు పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వాస్తవానికి, హీరో గ్రూప్ కి చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) ప్రత్యేకించి కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లను మాత్రమే తయారు చేస్తున్న సంగతి తెలిసినదే.

అయితే, హీరో ఎలక్ట్రిక్ అందించే స్కూటర్లకు భిన్నంగా మరియు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఇతర అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా ప్రత్యేకించి హీరో మోటోకార్ప్ బ్రాండ్ క్రింద ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువచ్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే, హీరో మోటోకార్ప్ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ 2-వీలర్ను విడుదల చేసే ప్రణాళికలను అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం ఈ హీరో మోటోకార్ప్ యొక్క ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రాజెక్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేయనున్నారు. ఈ కొత్త ఉత్పత్తి మార్చి 2022 నాటికి ప్రారంభించబడుతుందని సమాచారం. చిత్తూరు జిల్లాలోని హీరో మోటోకార్ప్ యొక్క కర్మాగారం పర్యావరణ అనుకూలమైనది మరియు స్థిరమైన తయారీ పద్ధతులను ఉపయోగిస్తుందని, ఇక్కడి ప్లాంట్ లో కంపెనీ బ్యాటరీ ప్యాక్ తయారీ మరియు టెస్టింగ్, వెహికల్ అసెంబ్లీ మరియు వెహికల్ ఎండ్ ఆఫ్ లైన్ టెస్టింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
హోండా టూవీలర్ బ్రాండ్ నుండి హీరో మోటోకార్ప్ విడిపోయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, గత ఆగస్టు నెలలో కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోడల్ కాన్సెప్ట్ దశ నుండి ఉత్పత్తి దశకు చేరుకుంటోంది. హీరో మోటోకార్ప్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బ్యాటరీలతో సహా అన్ని ప్రధాన భాగాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఈ ప్లాంట్ ను ఉపయోగించనున్న నేపథ్యంలో, కంపెనీ సరసమైన ధరకే ఈ ఎలక్ట్రిక్ టూవీలర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

గతంలో ప్రదర్శించిన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాన్సెప్ట్ మోడల్ లోని ముందు బాగంలో కంపెనీ 12 ఇంచ్ వీల్ మరియు వెనుక వైపు 10 ఇంచ్ వీల్ ను ఉపయోగించింది. ప్రొడక్షన్ మోడల్ కూడా అదే పరిమాణంలో ఉన్న వీల్స్ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ స్కూటర్లో తైవానీస్ కొకోరో కంపెనీకి చెంగిన రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ కూడా ఉంటుందని సమాచారం. అలాగే హీరో మోటోకార్ప్ దీనిని స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్లతో పరిచయం చేసే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ తయారు చేయబోయే ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో తమ అనుబంధ సంస్థ అయిన హీరో ఎలక్ట్రిక్ సహకారం కూడా ఉండే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ విభాగంలో అనేక కొత్త కంపెనీలు ప్రవేశించాయి. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మరియు సింపుల్ ఎనర్జీ వంటి సంస్థలు అధునాతన స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించడం ప్రారంభించాయి.

స్టాండర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చుకుంటే, ఇవి ప్రత్యేకమైన స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, అధిక రేంజ్ కలిగిన బ్యాటరీ ప్యాక్ లను కూడా కలిగి ఉంటున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్లు మార్కెట్ను శాసించడం ప్రారంభిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వ్యాపారం జోరుగా సాగే అవకాశం ఉంది. ఇక హీరో మోటోకార్ప్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ ఈవీ వంటి మోడళ్లతో పాటుగా ఓలా ఎస్1, సింపుల్ వన్, ఏథర్ 450ఎక్స్ వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) నుండి కొత్తగా 1000 టచ్పాయింట్స్..
ఇదిలా ఉంటే హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) ముగిసే నాటికి దేశవ్యాప్తంగా 1,000 సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఇటీవలే దేశవ్యాప్తంగా 300 కొత్త సేల్స్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కంపెనీ తమ నెట్వర్క్ ను కూడా విస్తరించాలని నిర్ణయించింది.

కేవలం సేల్స్ టచ్పాయింట్లను మాత్రమే కాకుండా, ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు విక్రయాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 500 నగరాల్లో సానుకూల విక్రయాలను కలిగి ఉంది మరియు ఈ నగరాల్లో 700 కంటే ఎక్కువ సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ లను కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








