ఓలా హైపర్ చార్జింగ్ నెట్వర్క్: 400 నగరాల్లో లక్ష చార్జింగ్ పాయింట్స్!
ప్రముఖ టాక్సీ సేవల సంస్థ ఓలాకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ విభాగం ఓలా ఎలక్ట్రిక్, భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఓలా తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఈ ఏడాది జులై నెలలో మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

ఓలా ఎలక్ట్రిక్, తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో భారీ ప్లాన్స్ చేస్తోంది. ఇందులో భాగంగానే, తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ఇప్పుడు, భారతదేశవ్యాప్తంగా ఓ హైపర్ఛార్జ్ నెట్వర్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

భారత రోడ్లపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల చార్జింగ్ విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు గానూ, దేశవ్యాప్తంగా 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ఛార్జింగ్ నెట్వర్క్గా అవతరిస్తుంది.

మొదటి సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ 100 నగరాల్లో 5,000 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రధాన సవాలుగా ఉన్న చార్జింగ్ మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ హైపర్చార్జర్ నెట్వర్క్ను ప్రకటించింది.

ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుతో హోమ్ ఛార్జర్తో పాటుగా హై-స్పీడ్ ఓలా హైపర్ఛార్జర్ ఆప్షన్ను కూడా అందించనున్నట్లు సమాచారం. ఓలా హైపర్చార్జర్ సాయంతో స్కూటర్లోని బ్యాటరీలను వేగవంతంగా చార్జ్ చేసుకోవచ్చు.

ఈ హైపర్ చార్జర్ సాయంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ 50 శాతం చార్జింగ్తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్పై 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఓలా హైపర్ఛార్జర్ చార్జింగ్ పాయింట్లను దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్, ఐటి పార్కులు, ఆఫీస్ కాంప్లెక్సులు, కేఫ్లు మొదలైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించే కస్టమర్ల చుట్టూ ఎల్లప్పుడూ ఓలా ఛార్జింగ్ నెట్వర్క్ ఉండేలా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

ఓలా హైపర్ఛార్జర్ నెట్వర్క్ను ఓలా మరియు దాని భాగస్వాములు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నారు. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటుగా అందించే హోమ్ ఛార్జర్ను ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లగ్ అండ్ ప్లే రూపంలో దానిని సాధారణ సాకెట్లో ఉంచడం ద్వారా స్కూటర్ను ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ విధంగా తాము తమ ఓలా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన వినియోగదారులకు గొప్ప ఛార్జింగ్ అవకాశాన్ని కల్పించబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ వినియోగదారులు నేరుగా ఛార్జింగ్ స్టేషన్కు వెళ్లి వారి స్కూటర్ను ఛార్జింగ్ పాయింట్లోకి ప్లగ్ చేయవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ యాప్ సాయంతో వినియోగదారులు ఛార్జింగ్ ప్రక్రియను కూడా పర్యవేక్షించవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ కోసం చెల్లింపులు కూడా చేయవచ్చు. ఈ మొత్తం వ్యవస్థపై వచ్చే అయిదేళ్లలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








