2021 లో భారత్లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు: పూర్తి వివరాలు
2021 సంవత్సరం ముగియడానికి మరెన్నో రోజులు లేవు. అయితే ఆటో మొబైల్ పరిశ్రమకు ఈ సంవత్సరం చాలా కలిసి వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రానున్న 2022 వ సంవత్సరంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు విడుదయ్యే అవకాశం ఉంటుంది, అని కూడా నిస్సంకోచంగా చెప్పవచ్చు.
భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరగడంతో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరంలో దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మరియు టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Ola ఎలక్ట్రిక్ S1 మరియు S1 Pro:
2021 లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో సంచలనం సృష్టించిన కంపెనీ ఏదైనా ఉంటే, Ola ఎలక్ట్రిక్ ఒకటి. ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో Ola S1 మరియు S1 ప్రో అనే రెండు స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు స్కూటర్ల ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్).

Ola ఎలక్ట్రిక్ విడుదల చేసిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్పై 121 కిమీల రేంజ్ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

సింపుల్ వన్:
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ప్రధాన ప్రత్యర్థి. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 1.09 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడిన 4.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. గ్రే కలర్ బ్యాటరీ ప్యాక్ మరియు 6 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ భారతీయ వినియోగదారులకు కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, కావున దీనిని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 240 కిమీ రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతమవుతుంది. ఇది హై స్పీడ్ స్కూటర్, కావున దీని గరిష్ట వేగం గంటకు 100 కిమీ వరకు ఉంటుంది. ఇది ఎకో మోడ్లో 203 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, కేవలం 60 సెకన్లలో 2.5 కిమీ రేంజ్ వరకు ఛార్జ్ అవుతుంది. ఇది హోమ్ ఛార్జర్ ద్వారా 2.75 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేస్తుంది. రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను కంపెనీ ఏర్పాటు చేయబోతోంది, ఇక్కడ వినియోగదారులు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఏథర్ 450ఎక్స్:
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ను దేశీయ మార్కెట్లో రూ. 1.32 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 116 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. ఈ స్కూటర్ కూడా ప్రస్తుతం దేశంలో వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలో 40 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లో 2.61 కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తుంది. కొత్త ఏథర్ 450 ఎక్స్ 3 గంటల 35 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చని Ather పేర్కొంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్:
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన ప్రీమియం శ్రేణిలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను రూ. 1.42 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్ ను మార్కెట్ లో అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో ప్రీమియం వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే) గా ఉన్నాయి.

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను తొలగించడానికి వీలు లేదు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు ఎకో మోడ్ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్ లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ను పూణేలో విడుదల చేసింది. పూణేలో విడుదలైన ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు (ఆన్-రోడ్).

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఒకే ఛార్జ్ (ఎకో మోడ్) పై గరిష్టంగా 75 కి.మీ పరిధిని అందిస్తుంది. దీని అగ్ర వేగం గంటకు 80 కి.మీ వరకు ఉంటుంది. ఈ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం నాలుగు గంటల్లో 0 నుంచి 75 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కూటర్ ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకూండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








