మే 31 వరకూ యమహా ఇండియా కాంచీపురం, సూరజ్పూర్ ప్లాంట్స్ షట్డౌన్!
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో దేశంలోని అనేక రాష్ట్రాలు పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లను విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పలు ఆటోమొబైల్ కంపెనీలు కూడా స్వచ్ఛందంగా తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి.

తాజాగా జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా కూడా తమిళనాడు రాష్ట్రంలోని తమ కాంచీపురం ప్లాంట్లో మరియు ఉత్తరప్రదేశ్లోని సూరజ్పూర్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లను మే 15 నుండి మే 31, 2021 వరకు మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది.

దేశంలో విపరీతంగా పెరుగిపోతున్న కోవిడ్ కేసులను పరిగణలోకి తీసుకుని, తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని యమహా ఇండియా తెలిపింది. కోవిడ్తో ప్రభుత్వ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి, అలాగే కోవిడ్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది.

దేశంలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం లాక్డౌన్ను ప్రకటించాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యమహా తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 15 రోజుల పాటు తమ ప్లాంట్ను మూసివేయాలని నిర్ణయించుకుంది.

ఈ నిర్ణయం వలన కొత్త యమహా వాహనాల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి మరియు స్టాక్ యొక్క సరైన వాడకంపై దృష్టి పెట్టడానికి యమహా తమ డీలర్లు మరియు సరఫరాదారులతో నిరంతరం పనిచేస్తోంది. కోవిడ్-19 సమయంలో పాటించాల్సిన అన్నిరకాల ఆరోగ్య సూత్రాలను కంపెనీ పాటిస్తోంది.

యమహా కార్పోరేట్ కార్యాలయం మరియు ప్రాంతీయ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వ్యాపారం యొక్క కొనసాగింపును దృష్టిలో ఉంచుకుని ఇంటి నుండి పని చేస్తూనే ఉంటారని కంపెనీ తెలిపింది. అలాగే, వినియోగదారులకు మరియు వ్యాపార భాగస్వాములకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని వీరు ఇంటి నుండే అందిస్తారని తెలిపింది.

యమహా తమ స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని అప్గ్రేడ్ చేయటం ప్రారంభించింది మరియు తమ కర్మాగారంలో పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. యమహా తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి మరియు ఉద్యోగులందరి భద్రతను నిర్ధారించడానికి హెచ్ఆర్ విధానంలో పనిచేస్తోంది.

యమహా బ్రాండ్కు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ యమహా ఎమ్టి-15లో ఓ కొత్త వేరియంట్ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్తగా రాబోయే యమహా ఎమ్టి-15 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్సైకిల్ ఇకపై డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్తో లభ్యం కానుంది.

యమహా ఎమ్టి-15 బైక్ను తొలిసారిగా 2019లో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇప్పటి వరకూ ఇది సింగిల్ ఛానెల్ ఏబిఎస్తో మాత్రమే అమ్ముడయ్యేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ను విడుదల చేయనుంది. అయితే, కొత్తగా జోడించిన ఈ ఫీచర్ కారణంగా ఈ బైక్ ధరలను మరింత పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








