తెలంగాణలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. 80 ఏళ్ల వృద్ధుడు మృతి, మరో ముగ్గురికి గాయాలు..
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్న నేపథ్యంలో, కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు తరచూ అగ్ని ప్రమాదాలకు గురవుతుండటం కొత్త కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, తెలంగాణా రాష్ట్రంలో మరొక ఎలక్ట్రిక్ బ్యాటరీ పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ ఎలర్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడు మరియు అతని కుటుంబంలోని మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. పోలీసుల ప్రాధమిక సమాచారం ప్రకారం, వారి ఇంటి గదిలో బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని బి రామస్వామిగా గుర్తించారు. అతని కుమారుడు బి ప్రకాష్ ఏడాది కాలంగా ప్యూర్ ఈవీ (Pure EV) కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు తండ్రిని కాపాడే క్రమంలో కుమారుడు ప్రకాష్, భార్య కమలమ్మ, కోడలు కృష్ణవేణి లకు కూడా కాలిన గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సంఘటనపై ప్యూర్ ఈవీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది మరియు "తాము ఈ సంఘటనపై తీవ్రంగా చింతిస్తున్నామని మరియు బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని" అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ప్యూర్ ఈవీ కస్టమర్ డేటాబేస్లో ఈ వాహనం లేదా దానికి సర్వీస్ చేసిన దాఖలాలు లేవని, ఒకవేళ దీనిని సెకండ్ హ్యాండ్ సేల్ ద్వారా కొనుగోలు చేశారో లేదో తనిఖీ చేస్తామని కంపెనీ తెలిపింది.

ఇది ఐదవ ప్యూర్ ఈవీ ఫైర్ యాక్సిడెంట్!
ప్యూర్ ఈవీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలలో ఎక్కువగా మంటలు చెలరేగిన ఘటనలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో సోమవారం నాడు మరొక ప్యూరీఈవీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీనితో కలిపి గత ఏడు నెలల్లో ఏకంగా 4 ప్యూర్ ఈవీ స్కూటర్లు మంటల్లో దగ్ధం కావడం గమనార్హం. తాజాగా నిజామాద్ జిల్లాలో జరిగినది 5వ సంఘటన. మూడు వారాల కిందటే ఒక ప్యూర్ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఏప్రిల్ 18న వరంగల్లో ప్యూర్ ఈప్లూటో 7జి ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. గత నెలలో తమిళనాడులోని చెన్నైలో కూడా ఓ ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు వచ్చాయి.

ఈవీలలో వరుస అగ్ని ప్రమాదాలు
ఇటీవల జితేంద్ర ఈవీ (Jitendra EV) అనే ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీకి చెందిన ఓ డెలివరీ ట్రక్కు 40 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఫ్యాక్టరీ నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లో ట్రక్కులోని పై వరుసలో ఉన్న 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా అగ్నికి ఆహుతై పోయాయి. ఈ సంఘటన ఏప్రిల్ 9 న జరిగినట్లుగా చెబుతున్నారు మరియు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మార్చి 26న పూణెలో ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్లో మంటలు చెలరేగాయి. అదే రోజు, తమిళనాడులోని వెల్లూరులో ఇంట్లో చార్జ్ చేస్తున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయి ఒక వ్యక్తి మరియు అతని 13 ఏళ్ల కుమార్తె మరణించారు.

ఈవీలో అగ్నిప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం ఇది రెండోసారి. డిసెంబర్ 2021లో, రాత్రి సమయంలో ఛార్జ్ అవుతున్న కార్గో స్కూటర్ నుండి వచ్చిన మంటల కారణంగా ఓ 60 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మానేసర్కు చెందిన హెచ్సిడి ఇండియా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేసింది. కాగా, ఇప్పుడు తెలంగాణాలో ప్యూర్ ఈవీ ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగడం ఇది మూడవసారి. మార్చి 28న తమిళనాడులో మరో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి, ఆ తర్వాత మార్చి 29న చెన్నైలో ఓ ప్యూర్ ఈవీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు వ్యాపించాయి.

ఈవీ కంపెనీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన గడ్కరీ!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు ఎక్కువ కావడంతో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయ్యారు. ఈవీల విషయంలో ఏ కంపెనీ అయినా సరే తగిన నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే, వారిపై భారీ జరిమానాలు విధిస్తామని ఆయన సీరియర్ వార్నింగ్ ఇచ్చారు. గత రెండు నెలల నుంచి పలు ఎలక్ట్రిక్ టూవీలర్స్ పేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ ఘటనలలో కొంతమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడం, మరి కొందరు గాయాలు పాలు కావడం దురదృష్టకరమని నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు.

ఈవీ అగ్ని ప్రమాదాలపై విచారణ కమిటీ
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఇలా తరచూ అగ్ని ప్రమాదాలకు గురవతుండటంతో, వాటి భద్రత విషయంలో ప్రజలకు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కేంద్రం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎలక్ట్రిక్ టూవీరల్లలో మంటలు వ్యాపించడానికి గల కారణాలను పరిశోధించి, ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది. సీఎఫ్ఈఈఎస్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క రక్షణ ప్రయోగశాల. ఇది ఇటీవలి ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాల సంఘటనలను సంబంధించిన కారణాలను పరిశోధించనుంది.
గమనిక: ఫోటోలు ప్రాతినిద్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించండి.


Click it and Unblock the Notifications








