ఏథర్ 450ఎక్స్, 450ప్లస్ ఇ-స్కూటర్లలో కొత్తగా SmartEco రైడ్ మోడ్ లాంచ్.. ఇప్పుడు మరింత నిజమైన రేంజ్!
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy), భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఓ అప్డేట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ తమ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త SmartEco అనే రైడ్ మోడ్ను పరిచయం చేసింది. ఏథర్ ఇ-స్కూటర్ల యజమానులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల నుండి నిజమైన రేంజ్ను పొందడం కోసం ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) అప్డేట్ ద్వారా స్మార్ట్ఎకో రైడ్ మోడ్ను అప్గ్రేడ్ చేసుకోవచ్చు.

ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ కొత్త స్మార్ట్ ఎకో (SmartEco) మోడ్, ఆయా స్కూటర్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మునుపటి ఎకో (Eco) మోడ్ను భర్తీ చేస్తుంది. రైడర్లు తమ స్కూటర్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయడం ద్వారా ఈ OTA అప్డేట్ను పొందవచ్చు. ఏథర్ ల్యాబ్స్ దీన్ని క్రమంగా కస్టమర్లందరికీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం, ఏథర్ ఇ-స్కూటర్ లలో ఉన్న ఎకో మోడ్ని ఉపయోగించడం వలన రైడర్లు ఇతర మోడ్లలో కన్నా ఎక్కువ రేంజ్ను పొందుతారు.

సాధారణంగా, ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎకో రైడ్ మోడ్ని ఉపయోగించడం వలన సదరు స్కూటర్ ప్రయాణించే గరిష్ట వేగం తగ్గుతుంది. అంటే, ఇది స్కూటర్ యాక్సిలరేషన్ (ఇంజన్) పవర్ను తగ్గిస్తుంది. ఈ మోడ్లో ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్పై ఎక్కువ ప్రభావం పడదు కాబట్టి, ఇందులో ఇతర హై-స్పీడ్ మోడ్ల కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది. అయితే, ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో కొత్తగా పరిచయం చేసిన ఈ స్మార్ట్ ఎకో మోడ్లో, సదరు ఇ-స్కూటర్ గరిష్ట త్వరణాన్ని (యాక్సిలరేషన్)ను అందిస్తూనే, బ్యాటరీ విద్యుత్ వినియోగాన్ని తెలివిగా నియంత్రిస్తుంది. కాబట్టి, ఇది నిజమైన రేంజ్ను సాధించడానికి సహకరిస్తుందని కంపెనీ చెబుతోంది.

స్మార్ట్ ఎకో రైడ్ మోడ్ రహదారి పరిస్థితులు, రైడింగ్ శైలి మరియు ప్రయాణీకుల సంఖ్యతో సహా అనేక అంశాలను లెక్కిస్తుందని మరియు వాటికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నియంత్రిస్తుందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఏథర్ 450 స్కూటర్లను స్మార్ట్ ఎకో మోడ్లో రైడ్ చేస్తూ, రోడ్డుపై మరొక వాహనాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు రైడ్ లేదా స్పోర్ట్ మోడ్కి మారాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, ఇది స్కూటర్ బ్యాటరీ యొక్క ఛార్జ్ మరియు రేంజ్ని కూడా తగ్గించదు.

ఒకవేళ మీరు ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లను పూర్తి సరదాతో, ఫుల్ స్పీడ్లో రైడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు స్పోర్ట్ లేదా వార్ప్ మోడ్ను ఎంచుకోవచ్చు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ ఒక్క అప్డేట్ మినహా వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. ఈ అప్డేట్ త్వరలో ఓవర్-ది-ఎయిర్ (OTA) ద్వారా కస్టమర్లకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం, ఏథర్ ఎనర్జీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1,52,401 కాగా, ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1,33,391 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్, విజయవాడ)గా ఉంది.

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ (సర్టిఫైడ్ రేంజ్) పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఈ బ్యాటరీ ప్యాక్ IP67 రేటెడ్ వాటర్ప్రూఫ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కంపెనీ దీనిపై 3 ఏళ్ల అపరిమిత వారంటీని అందిస్తుంది. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో నాలుగు రైడింగ్ మోడ్స్ (స్మార్ట్ఎకో, రైడ్, స్పోర్ట్స్ మరియు వార్ప్) ఉంటాయి. ఇది పూర్తి చార్జ్పై ఎకో మోడ్లో 85 కిమీ, రైడ్ మోడ్లో 70 కిమీ, స్పోర్ట్స్ మోడ్లో 60 కిమీ రేంజ్ను అందిస్తుంది. వార్ప్ మోడ్లో ఈ స్కూటర్ దాని సర్టిఫై చేసిన గరిష్ట వేగంతో (గంటకు 80 కిమీతో) పరుగులు తీస్తుంది. ఈ మోడ్లో రేంజ్ ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ ధృవీకరించలేదు.

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీని ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. అలాగే, 3 గంటల 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో అంతర్నిమిత (బిల్ట్-ఇన్) ఆటో కట్-ఆఫ్ మరియు సర్జ్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది చార్జ్ పూర్తవగానే ఆటోమేటిక్ పవర్ తీసుకోవడాన్ని నిలిపివేస్తుంది ఫలితంగా ఓవర్హీటింగ్ సమస్యను నివారిస్తుంది. స్మార్ట్ఫోన్ యాప్ సాయంతో యూజర్లు తమ స్కూటర్ యొక్క బ్యాటరీ స్థితిని కుడా రిమోట్గా చెక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








