ఎథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు కస్టమర్ల పరుగులు.. జనవరిలో 366 శాతం పెరిగిన సేల్స్..
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ (Ather Energy) ప్రస్తుతం భారత మార్కెట్లో ఒకేఒక స్కూటర్ ను మాత్రమే విక్రయిస్తోంది. అయినప్పటికీ, ఈ మోడల్ కు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2022లో కంపెనీ మొత్తం 2,825 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. జనవరి 2021 నెలలో కంపెనీ విక్రయించిన అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 366 వృద్ధి చెందాయి.

సప్లయ్ చైన్ లో సమస్యల కారణంగా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా కంపెనీ వాహనాలను అందించలేకపోతోంది. ఏథర్ ప్రస్తుతం 450 అనే స్కూటర్ ను విక్రయిస్తోంది. ఇది 450ఎక్స్ మరియు మరియు 450ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది, దీని కారణంగా కంపెనీ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఏథర్ ఎనర్జీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 304 ఫాస్ట్ ఛార్జింగ్ ఏథర్ గ్రిడ్ పాయింట్లు, 24 నగరాల్లోని 29 స్టోర్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాల్లో కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించాలని చూస్తోంది. అలాగే, దేశవ్యాప్తంగా ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. ఇటీవలి కాలంలో కంపెనీ తన డీలర్షిప్లను నిరంతరం విస్తరిస్తూ వస్తోంది. తాజాగా నాగ్పూర్, లక్నో, చెన్నై మరియు త్రివేండ్రం నగరాల్లో కంపెనీ తమ ఎథర్ ఎక్స్పీరియెన్స్ సెంటర్లను ప్రారంభించింది.

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ రాబోయే నెలల్లో మరిన్ని కొత్త డీలర్షిప్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం, తమ వద్ద తగినంత ఆర్డర్లు ఉన్నాయని, ప్రజలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ల వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కలిగి ఉన్నారని ఫలితంగా, వీటికి డిమాండ్ భారీగా పెరిగిందని కంపెనీ తెలిపింది. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు మరింత మెరుగ్గా ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఏథర్ ఎనర్జీ తమ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు అన్ని ప్రధాన నగరాల్లో ఏథర్ స్పేస్ ఎక్స్పీరియెన్స్ సెంటర్లను ప్రారంభిస్తోంది. ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీ ఇప్పుడు రెండవ ప్లాంట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోనే కంపెనీ ఈ కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటు తర్వాత, కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 4,00,000 యూనిట్లకు చేరుకోనుంది.

ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ తమ కస్టమర్లకు ఈ ఏడాది జూన్ 30 వరకు తమ అన్ని ఛార్జింగ్ గ్రిడ్లలో ఉచిత ఛార్జింగ్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ప్రకటిచింది. గతంలో ఈ ఉచిత చార్జింగ్ సౌకర్యాన్ని కంపెనీ సెప్టెంబర్ 2021లో ఈ ఏడాది మే నెల వరకూ పొడగించింది. కాగా, ఇప్పుడు దీనిని జూన్ నెలాఖరు వరకూ పొడగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు, కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉచిత కనెక్టివిటీ సౌకర్యాన్ని కూడా మే 2022 వరకు పొడిగించింది.

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉచిత కనెక్టివిటీ సౌకర్యాన్ని నవంబర్ 15 న ప్రారంభించారు. కంపెనీ ఛార్జింగ్ గ్రిడ్ ప్రస్తుతం కేవలం ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్లకు మాత్రమే కాకుండా అన్ని ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉంటే, ఏథర్ ఎనర్జీ తాజాగా తమ 450ఎక్స్ మరియు 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను పెంచింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన కంపెనీ వీటి ధరలను పెంచింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇప్పుడు రూ.5500 వరకు పెంచబడ్డాయి.

దేశంలోని కొన్ని నగరాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ స్కూటర్లపై సబ్సిడీలను అందిస్తున్నాయి. సబ్సిడీ అనంతరం ముంబై నగరంలో, ఏథరి 450 ప్లస్ ధర రూ. 1.09 లక్షలుగా ఉంటే, ఏథర్ 450ఎక్స్ ధర రూ. 1.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రైడ్ మరియు ఎకో అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది. ఎకో మోడ్లో, ఇది 85 కిమీ మరియు రైడ్ మోడ్లో 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








