డిశ్పాచ్ క్విర్కీ (Dispatch Quirky) మాడ్యులక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ.. లాంచ్ ఎప్పుడంటే..?
దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారు స్టార్టప్ కంపెనీ డిస్పాచ్ (Dispatch), ప్రపంచంలోనే మొట్టమొదటి మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్విర్కీ (Quirky)ని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను వచ్చే ఏడాది (2023) లో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను గ్లోబల్ ప్రొడక్ట్గా అభివృద్ధి చేస్తోంది, తద్వారా దీనిని కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేయాలని ప్లాన్ చేస్తోంది.

డిశ్పాచ్ క్విర్కీ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా విచిత్రమైన మరియు విశిష్టమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. వినియోగదారులు మరియు వాణిజ్య కంపెనీల అవసరాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అనేక రకాలుగా ఉపయోగించుకునే విధంగా రూపొందించబడింది. అందుకే, దీనిని మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నారు. అంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను వ్యక్తిగత రవాణా పర్సనల్ ట్రాన్స్పోర్ట్ తో పాటుగా ఫ్లీట్ ఆపరేషన్స్ మరియు డెలివరీ ప్రయోజనాల కోసం వాణిజ్య పరంగా కూడా ఉపయోగించుకోవచ్చన్నమాట.

వ్యక్తిగత ఉపయోగం, డెలివరీ ఆపరేషన్స్, టాక్సీ స్కూటర్, పెట్రోలింగ్ మరియు మరెన్నో వాణిజ్య కార్యకలాపాల కోసం ఉద్దేశించి రూపొందించిన ఈ మొట్టమొదటి మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ క్విర్కీని కంపెనీ ఆయా ప్రయోజనాలకు అనుగుణంగా కస్టమైజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా సులువుగా ఆపరేట్ చేయగలరని, ఇది విశ్వసనీయమైనది మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉన్న స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. డెలివరీ ఫ్లీట్లో ఎక్కువ లాభాలను ఆర్జించడంలో ఈ స్కూటర్ యూజర్కు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

డిస్పాచ్ వెహికల్స్ తన ఇ-స్కూటర్లను విశ్వసనీయత మరియు ధృవీకరణ కోసం దాదాపు ఒక సంవత్సరం పాటుగా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 6 మిలియన్ ఇ-స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద కాంట్రాక్ట్ తయారీదారులలో ఒకదానితో భాగస్వామ్యం కలిగి ఉంది. మెకానికల్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఇ-స్కూటర్ల పవర్ట్రెయిన్లతో సహా అనేక రకాల క్లిష్టమైన భాగాలను కంపెనీ అందుబాటులో ఉంచుతుంది.

వాణిజ్య ఉపయోగం కోసం రూపొందించిన స్కూటర్తో, ప్రస్తుత ఉత్పత్తుల కంటే మార్కెట్కు మెరుగైన సేవలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. డిస్పాచ్ వెహికల్స్ 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేలా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్యాసింజర్ మరియు కమర్షియల్ ఫ్లీట్ ఆపరేటర్ల కోసం సహాయం చేయనుంది. ప్రస్తుతం వాణిజ్య రంగంలో వినియోగిస్తున్న చాలా టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు వాస్తవానికి ప్యాసింజర్ సెక్టార్ కోసం రూపొందించబడినవేనని డిస్పాచ్ వెహికల్స్ కో-ఫౌండర్ రంజిత్ ఆర్య చెప్పారు.

ఇలాంటి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలు కమర్షియల్ ఫ్లీట్ అవసరాలకు సరిపోవని, ఫలితంగా చాలా కంపెనీలు నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. డిస్పాచ్ యొక్క ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు ప్రత్యేకంగా వాణిజ్య రంగం కోసం రూపొందించబడ్డాయి, ఇది వ్యాపారంలో లాభాలతో పాటు ఉద్యోగుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని కంపెనీ చెబుతోంది. గ్లోబల్ మార్కెట్లో క్విర్కీ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయడానికి కంపెనీ 32 కంటే ఎక్కువ దేశాలలో పేటెంట్లను కూడా దాఖలు చేసింది.

2000 లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసిన ప్యూర్ ఈవీ (Pure EV)
ఇదిలా ఉంటే, తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్యూర్ ఈవీ అగ్ని ప్రమాదం కారణంగా, ఓ 80 ఏళ్ల వృద్ధుడు మరియు మరో ముగ్గురికి గాయాలు కావడం ఘటనపై ప్యూర్ ఈవీ (Pure EV) సంస్థ అప్రమత్తమైంది. గత నెలలో చెన్నైలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి నమోదు కావడంతో ప్యూర్ ఈవీ ఇప్పుడు తాము విక్రయించిన ETrance Plus మరియు EPluto 7G మోడల్లకు చెందిన 2,000 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రీకాల్ చేసిన స్కూటర్లలో బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ వ్యవస్థను కంపెనీ ఉచితంగా తనిఖీ చేయనుంది.

ప్యూర్ ఈవీ తెలిపిన వివరాల ప్రకారం, తమ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు బ్యాటరీలు యొక్క ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయబడతాయని, ఏదైనా అసమతుల్యత సమస్యల కోసం తాను బ్యాటరీని తనిఖీ చేస్తామని మరియు తమ BaTRics Faraday (లిథియం అయాన్ బ్యాటరీలలోని లోపాలను స్వయంచాలకంగా గుర్తించి మరియు సరిచేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హార్డ్వేర్) పరికరం ద్వారా వాటిని సరిచేస్తామని ప్యూర్ తమ ప్రకటనలో తెలిపింది. వీటికి అదనంగా BMS మరియు ఛార్జర్ క్యాలిబ్రేషన్ కూడా అవసరమైన విధంగా నిర్వహించబడతాయని ప్యూర్ ఈవీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ప్యూర్ ఈవీతో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ మరియు ఓకినావా వంటి ఇతర ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కూడా సుమారు 7000 యూనిట్లకు పైగా ద్విచక్ర వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. వరుస ఈవీ అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, కేంద్రం ఈ విషయంపై అప్రమత్తమైంది. ఈవీ అగ్ని ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు తామే స్వయంగా రంగంలోకి దిగింది. ఈవీ అగ్ని ప్రమాదాలపై వెంటనే ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది.


Click it and Unblock the Notifications








