కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విడుదలను ఆపమని మేము చెప్పలేదు: భారత ప్రభుత్వం
భారతదేశంలో గడచిన రెండు నెలల వ్యవధిలో దాదాపు అరడజనుకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాద ఘటనలు జరిగడం మరియు ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం నేపథ్యంలో, కేంద్రం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. ఈవీ అగ్ని ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు తామే స్వయంగా రంగంలోకి దిగింది. ఈవీ అగ్ని ప్రమాదాలపై వెంటనే ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది.

అయితే, ఈ పరిస్థితుల్లో కొత్తగా విడుదల చేయబోయే ఎలక్ట్రిక్ వాహనాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఈవీ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించినట్లుగా పలు మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల లాంచ్లను నిలిపివేయడానికి తాము వాహన తయారీదారులకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 27 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు నిప్పు అంటుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఈవీ తయారీదారులు తమ కొత్త వాహనాలను ప్రారంభించడాన్ని ప్రభుత్వం మౌఖికంగా నిరాకరించిందని పేర్కొన్నారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత వచ్చే వరకు మరియు వాటిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు పటిష్టంగా ఉన్నాయని రుజువు చేసేంత వరకు, తయారీదారులు ఎవ్వరూ కూడా కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మార్కెట్లోకి విడుదల చేయరాదని ప్రభుత్వం ద్విచక్ర వాహన ఈవీ తయారీదారులకు తెలిపినట్లుగా సదరు వ్యక్తి మీడియాకు వెల్లడించారు. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని, తాము కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విడుదలను ఆపమని చెప్పలేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారికంగా తెలియజేసింది.

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగిన ద్విచక్ర వాహన ఈవీ తయారీదారులు, మంటలు చెలరేగిన అదే బ్యాచ్కు చెందిన అన్ని వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయాలని ప్రభుత్వం ఈ సమావేశంలో పాల్గొన్న తయారీదారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈవీ తయారీదారులు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఓలా ఎలక్ట్రిక్, ప్యూర్ ఈవీ మరియు ఒకినావా వంటి కంపెనీలు ఇప్పటికే తమ వాహనాల విషయంలో స్వచ్చంద రీకాల్ను ప్రకటించాయి.

గత వారం, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు, ఈవీ తయారీదారులు తమ ఇ-స్కూటర్లను రీకాల్ చేస్తున్నారు. పైన తెలిపిన మూడు కంపెనీలకు చెందిన తయారీదారులు ఇప్పటికే దాదాపు 7,000 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కు పిలిపిస్తున్నారు. ఇలా వెనక్కు వచ్చిన వాహనాల్లో కంపెనీ ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించి, వెంటనే వాటిని సరిచేస్తుంది. మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం తప్పు చేసిన తయారీదారులను బలవంతంగా తమ వాహనాలను రీకాల్ చేసేలా చేసి, భారీ జరిమానాలు కూడా విధించే అధికారం తమకు ఉందని ప్రభుత్వం ఈవీ తయారీదారులను హెచ్చరించింది.

కేవలం మంటలు అంటుకున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు చెందిన తయారీదారులు మాత్రమే కాకుండా, ఇలాంటి సంఘటనలు జరగని ఇతర తయారీదారులు కూడా తామ విక్రయించిన వాహనాలపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఛార్జింగ్ భద్రత మరియు ఇలాంటి అగ్ని ప్రమాదాలను ఎలా నిరోధించాలో అనే విషయంపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని మంత్రిత్వ శాఖ ఈవీ తయారీదారులను కోరింది.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాదాలు ఎక్కువ కావడంతో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సీరియస్ అయ్యారు. ఈవీల విషయంలో ఏ కంపెనీ అయినా సరే తగిన నాణ్యత ప్రమాణాలను పాటించకపోతే, వారిపై భారీ జరిమానాలు విధిస్తామని ఆయన సీరియర్ వార్నింగ్ ఇచ్చారు. గత రెండు నెలల నుంచి పలు ఎలక్ట్రిక్ టూవీలర్స్ పేలుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఈ ఘటనలలో కొంతమంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోవడం, మరి కొందరు గాయాలు పాలు కావడం దురదృష్టకరమని నితిన్ గడ్కరీ విచారం వ్యక్తం చేశారు.

దేశంలో ఇటీవల జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాద సంఘటనలను పరిశీలిస్తే, విజయవాడలో బూమ్ మోటార్స్ విక్రయిస్తున్న కార్బెట్ 14 ఎలక్ట్రిక్ మోపెడ్ చార్జింగ్లో ఉండగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా అతని భార్యకు మరియు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతకు ముందు తెలంగాణాలోని నిజామాబాద్లో ప్యూర్ ఈవీకి చెందిన ఓ బ్యాటరీ చార్జింగ్లో ఉండగా పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంతకు ముందు తమిళనాడులో ఓ ఇంటిలో చార్జ్ చేస్తున్న ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటుల వచ్చి ఓ తండ్రి కూతురు మరిణించారు. ఇవే కాకుండా, దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ఈవీ ఫైర్ యాక్సిడెంట్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








