ఉమెన్స్ డే ఆఫర్: మహిళా కస్టమర్లకు రూ. 6,000 డిస్కౌంట్ ప్రకటించిన హీరో మోటోకార్ప్
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మార్చ్ 2022 నెలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, తమ కస్టమర్ల కోసం ఒక గొప్ప ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ను కేవలం మహిళా వినియోగదారులకు మాత్రమే అందిస్తున్నారు. మహిళా కస్టమర్లు హీరో స్కూటర్ లను కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్లను పొందవచ్చు. కంపెనీ ఎంపిక చేసిన స్కూటర్ మోడల్స్పై మార్చి 11, 2022 వరకూ ఈ ఆఫర్ను అందిస్తోంది.

రూ.6,000 వరకు తగ్గింపు
కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం, ఎవరైనా మహిళా కస్టమర్ తన పేరు మీద హీరో స్కూటర్ ను కొనుగోలు చేస్తే, ఆమెకు స్కూటర్ ధరపై రూ. 6,000 వరకు తగ్గింపును లభించనుంది. అదే సమయంలో, కొంతమంది డీలర్లు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా వారి తరపున (డీలర్ సైడ్) డిస్కౌంట్లను కూడా అందిస్తున్నారు.

హీరో మోటోకార్ప్ అందిస్తున్న ప్లెజర్ ప్లస్, మాస్ట్రో ఎడ్జ్ 110, మాస్ట్రో ఎడ్జ్ 125 మరియు డెస్టినీ స్కూటర్లలో ఏదైనా ఓ స్కూటర్ను కొనుగోలు చేసిన మహిళా కస్టమర్కు కంపెనీ రూ. 4,000 వరకు నగదు బోనస్ మరియు రూ. 2,000 వరకూ ఎక్స్ఛేంజ్ / లాయల్టీ బోనస్ ను అందిస్తోంది. హీరో మోటోకార్ప్ ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఆఫర్ను అందిస్తుంది. కాబట్టి, ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం కస్టమర్లు వారికి సమీపంలోని అధీకృత డీలర్షిప్లను సంప్రదించవచ్చు.

హీరో ప్లెజర్ ప్లస్ ధరలు రూ. 62,220 నుండి, మాస్ట్రో ఎడ్జ్ 110 ధరలు రూ. 66,820 నుండి, మాస్ట్రో ఎడ్జ్ 125 ధరలు రూ. 73,450 నుండి మరియు డెస్టినీ 125 ధరలు రూ. 70,400 నుండి ప్రారంభమవుతాయి. పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఇదిలా ఉంటే, హీరో మోటోకార్ప్ మహిళా దినోత్సవం సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా 108 మోటార్సైకిళ్లను పంపిణీ చేసింది. హిమాచల్ పోలీసులు చంబా, హమీర్పూర్, ఉనా, బిలాస్పూర్, కాంగ్రా, సిర్మౌర్ మరియు మండి పోలీసు అవుట్పోస్టులలో ఈ మోటార్సైకిళ్లను ఉపయోగిస్తారు.

సరికొత్త హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది..
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి హీరో ఎలక్ట్రిక్ అనే సబ్ బ్రాండ్ ద్వారా కంపెనీ లో-స్పీడ్ మరియు సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, హీరో మోటోకార్ప్ బ్రాండ్ ద్వారా ఓలా ఎస్1, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా కంపెనీ ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురావాలని చూస్తోంది.

ఇందులో భాగంగా, హీరో మోటోకార్ప్ మార్చి 3, 2022వ తేదీన కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'విడా' (Vida) యొక్క లోగోను కూడా వెల్లడించింది, దాని కింద కంపెనీ తన రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించనుంది. కంపెనీ తమ Vida బ్రాండ్లో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను జూలై 1, 2022న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్ మరియు సిఇఒ డాక్టర్ పవన్ ముంజాల్ విడా బ్రాండ్ లోగోను బ్రాండ్ సోషల్ మీడియా హ్యాండిల్లో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కంపెనీ 'గ్రీన్' తయారీ కేంద్రంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసిన కొద్ది రోజుల తర్వాత కంపెనీ దాని డెలివరీ లను కూడా ప్రారంభించాలని చూస్తోంది. కొత్త బ్రాండ్ లాంచ్ కాకుండా, పవన్ ముంజాల్ 100 మిలియన్ డాలర్ల గ్లోబల్ సస్టైనబిలిటీ ఫండ్ను కూడా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిధులను వినియోగించనున్నట్లు ముంజాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








