ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించిన ఒడిస్సే (Odysse).. త్వరలోనే విడుదల!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఈ వృద్ధి గణనీయంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్కు తగినట్లుగా మార్కెట్లోకి కొత్త కొత్త ఈవీ బ్రాండ్లు కూడా ప్రవేశిస్తున్నాయి.
Recommended Video
తాజాగా ఒడిస్సే (Odysse) ఈవీ తయారీ సంస్థ భారత మార్కెట్లో మరో రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

అహ్మదాబాద్కి చెందిన ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే భారత మార్కెట్లో వివిధ రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు తమ లైనప్ లో కంపెనీ మరో రెండు కొత్త మోడళ్లను చేర్చింది. వీటిలో మొదటిది స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ కాగా, రెండవది మాక్సీ స్కూటర్ మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్. యూపిలోని నోయిడాలో జరిగిన ఈవీ ఇండియా ఎక్స్పో 2022 లో కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను ఆవిష్కరించింది.

కాగా, ఒడిస్సే ఎలక్ట్రిక్ ఈ రెండు వాహనాల పేర్లు మరియు ఇతర వివరాలను మాత్రం ప్రస్తుతాని గోప్యంగా ఉంచింది. ఓ నివేదిక ప్రకారం, ఇవి రెండూ ఈ ఏడాది చివరి నాటికి గానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు తమ భవిష్యత్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. మరికొన్ని సంస్థలు ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకొని తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు.

ఒడిస్సే ఆవిష్కరించిన ఈ రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అనేక ప్రత్యేక లక్షణాలతో అభివృద్ధి చేయబడ్డాయి. ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపించే ఈ ఇ-బైక్ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్లకు పైగా రేంజ్ను అందిస్తుందని మరియు ఇది పెట్రోల్ మోటార్సైకిళ్ల పెర్ఫార్మెన్స్తో ఏమాత్రం తీసిపోకుండా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్లో ఐఓటి మరియు బ్యాటరీ గురించి పూర్తి సమాచారాన్ని అందించే సదుపాయంతో కూడిన టచ్ స్క్రీన్ డిజిటల్ డిస్ప్లే యూనిట్, సమర్థవంతమైన ఎలక్ట్రిక్ మోటార్ మరియు సుధీర్ఘమైన రేంజ్ను అందించే బ్యాటరీ ప్యాక్, స్ప్లిట్ సీట్ మరియు నాణ్యమైన బాడీ ప్యానెల్స్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయని, జనవరి 2023 నాటికి ఈ ఇ-బైక్ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.

ఒడిస్సే ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారు లక్ష రూపాయల రేంజ్లో ఉంటుందని అంచనా. ఇది ఈ విభాగంలో హాప్ ఆక్సో (HOP OXO), రివోల్ట్ ఆర్వి400 (Revolt RV400), ఓబెన్ రోర్ (Oben Rorr) మరియు టోర్క్ క్రాటోస్ (Tork Kratos) వంటి ఎలక్ట్రిక్ బైక్ లకు పోటీగా నిలుస్తుంది.

ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్తో పాటుగా మ్యాక్సీ స్టైల్లో కనిపించే ఓ పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శించింది. ఇది ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కన్నా భిన్నంగా మరియు చాలా ప్రీమియంగా ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై సుమారు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ను అందించనుంది. అధిక రేంజ్ సామర్ధ్యం కోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగించనుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే యొక్క ప్రీమియం ఉత్పత్తి కానుంది. ఇది ఈ విభాగంలో ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450ఎక్స్, సింపుల్ వన్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలిచేందుకు అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్, బ్లూటూత్ కనెక్టివిటీ, సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం వంటి వివిధ ఆధునిక సాంకేతిక సౌకర్యాలు ఆశించవచ్చు. ఇది కూడా వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారత మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి రావచ్చని అంచనా.

ఇదిలా ఉంటే, ఒడిస్సే (Odysse) గడచిన మే నెలలో బారత మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఒడిస్సే వి2 (Odysse V2) మరియు ఒడిస్సే వి2 ప్లస్ (Odysse V2+) అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ విడుదల చేసింది. వీటిలో Odysse V2 ధర రూ. 75,000 (ఎక్స్-షోరూమ్) కాగా, Odysse V2+ ధర రూ. 97,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇవి రెండూ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఒడిస్సే వి2 మరియు వి2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదలతో, కంపెనీ ఇప్పుడు తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో మొత్తం 6 ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది.
గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిద్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించండి.


Click it and Unblock the Notifications








