పెరుగుతున్న ఇంధన ధరలు.. పెట్రోల్ టూవీలర్లు మాకొద్దంటున్న కస్టమర్లు..!
భారతదేశంలో గత రెండు వారాలుగా పెట్రోల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా, దాదాపు ఐదు నెలలు ఇంధన ధరలు పెంచకపోవడంతో చమురు కంపెనీలు సుమారు రూ.19,000 కోట్లు నష్టపోయినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు చమురు కంపెనీ ఇంధన ధరలను పెంచడం ప్రారంభించాయి. ఓ నివేదిక ప్రకారం, పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు రూ.15-20 వరకూ పెరగవచ్చని అంచనా.

పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో, పెట్రోల్ టూవీలర్లను కొనేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపడం లేదు. దీంతో గత నెలలో టీవీఎస్ అమ్మకాలు కూడా క్షీణించాయి. వాస్తవానికి టీవీఎస్ టూవీలర్లు అంటేనే మైలేజ్కి పెట్టింది పేరు. ఇప్పుడు అలాంటి బ్రాండ్ టూవీలర్లను కొనేందుకు కూడా కస్టమర్లు వెనక్కి తగ్గుతున్నారు. గడచిన మార్చి 2022 నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 3,07,954 యూనిట్ల వాహనాలను (ద్విచక్ర వాహనాలు మరియు త్రీ వీలర్లతో కలిపి) విక్రయించింది. మార్చి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 3,22,643 యూనిట్లతో పోలిస్తే, ఇవి 4.6 శాతం క్షీణించాయి.

ఈ మొత్తం అమ్మకాలలో కేవలం ద్విచక్ర వాహనాల అమ్మకాలను మాత్రమే పరిశీలిస్తే, మార్చి 2022లో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 2,92,918 ద్విచక్ర వాహనాలను (మోటార్సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు కలిపి) విక్రయించగా, గత ఏడాది మార్చి (2021)లో కంపెనీ 3,07,397 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో టీవీఎస్ టూవీలర్ల అమ్మకాలు 4.8 శాతం క్షీణించాయి.

భారతదేశంలో టీవీఎస్ విక్రయించిన టూవీలర్ అమ్మకాలను గమనిస్తే, మార్చి 2022లో ఇవి 1,96,956 యూనిట్లుగా ఉన్నాయి. కాగా, గతేడాది మార్చిలో విక్రయించిన 2,02,155 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ దేశీయ అమ్మకాలు 2.6 శాతం తగ్గాయి. అయితే, గత నెలలో మోటార్సైకిళ్ల అమ్మకాలు మాత్రం 2.05 శాతం పెరిగాయని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది. గత నెలలో కంపెనీ మొత్తం 1,60,522 యూనిట్ల మోటార్సైకిళ్లను విక్రయించగా, గతేడాది ఇదే నెలలో కంపెనీ 1,57,254 యూనిట్ల మోటార్సైకిళ్లను విక్రయించింది.

అయితే, టీవీఎస్ స్కూటర్ విక్రయాలు మాత్రమే తగ్గుముఖం పట్టాయి. గత నెలలో టీవీఎస్ స్కూటర్ల అమ్మకాలు 9.8 శాతం క్షీణతను నమోదు చేశాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ మార్చి 2022లో మొత్తం 94,747 యూనిట్ల స్కూటర్లను విక్రయించగా, గత ఏడాది మార్చిలో కంపెనీ 1,04,513 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. కరోనా మహమ్మారి వలన ఏర్పడిన సెమీకండక్టర్ల చిప్ కొరత కారణంగా ప్రీమియం ద్విచక్ర వాహనాల ఉత్పత్తి, విక్రయాలపై ప్రభావం పడిందని కంపెనీ పేర్కొంది. అయితే రానున్న నెలల్లో సరఫరాలో మెరుగుదల ఉంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ తెలిపింది.

టీవీఎస్ దేశీయ అమ్మకాలు మాత్రమే కాకుండా ఎగుమతులు కూడా క్షీణతను నమోదు చేశాయి. గత నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ ఎగుమతులను పరిశీలిస్తే, మార్చి 2022లో కంపెనీ మొత్తం 1,09,724 యూనిట్లను ఎగుమతి చేయగా, మార్చి 2021లో కంపెనీ 1,19,382 యూనిట్ల వాహనాలను భారతదేశం నుండి ఎగుమతి చేసింది. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు 8.4 శాతం క్షీణించాయి. ఇందులో ద్విచక్ర వాహనాల ఎగుమతులు 9.2 శాతం క్షీణించి 95,962 యూనిట్లకు పడిపోయాయి, గత ఏడాది ఇదే కాలంలో ఇవి 1,05,242 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ వివరించింది.

ద్విచక్ర వాహనాలతో పాటుగా టీవీఎస్ త్రీ వీలర్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. వీటి అమ్మకాలు కూడా స్వల్పంగా క్షీణించాయి. మార్చి 2021లో టీవీఎస్ మొత్తం 15,246 యూనిట్ త్రీవీలర్లను విక్రయించగా, ఈ ఏడాది మార్చిలో 15,036 యూనిట్లు విక్రయించింది. ఈ సమయంలో త్రీ వీలర్ల అమ్మకాలు 1.3 శాతం తగ్గాయి. మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కూడా కంపెనీ ఫలితాలు క్షీణించాయి. గడచిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ మొత్తం 8.15 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. కాగా, అంతకు ముందు ఇదే సమయంలో (2020-21 క్యూ4లో) విక్రయించిన 8.87 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇవి 8.4 శాతం క్షీణతను నమోదు చేశాయి.

పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మోటార్సైకిల్ 'టీవీఎస్ అపాచే 165 ఆర్పి' (TVS Apache 165 RP) లిమిటెడ్ ఎడిషన్ అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్సైకిల్ ను గడచిన డిసెంబర్ నెలాఖరులో దేశీయ విపణిలో విడుదల చేసింది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది. కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది.

కాగా, ఈ బైక్ మార్కెట్లో విడుదలైన మొదటి రెండు వారాల్లోనే పూర్తిగా 200 యూనిట్లు అమ్ముడైపోయినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం టీవీఎస్ విక్రయిస్తున్న స్టాండర్డ్ Apache RTR 160 4V మోడల్ ను ఆధారంగా చేసుకొని టీవీఎస్ ఈ లిమిటెడ్ ఎడిషన్ Apache RTR 165 RP బైక్ని విడుదల చేసింది. ఇందులో ఆర్పి అంటే 'రేస్ పెర్ఫార్మెన్స్' అని అర్థరం. టీవీఎస్ యొక్క కొత్త రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్లో భాగంగా భారతదేశంలో విడుదలైన మొదటి బైక్ ఇది. భవిష్యత్తులో ఈ రేస్ పెర్ఫార్మెన్స్ (RP) సిరీస్ టీవీఎస్ నుండి మరిన్ని మోడళ్లు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








