ఎలక్ట్రిక్ టూవీలర్లకు బీమా ఎందుకు తప్పనిసరికాదో వివరించండి: ప్రభుత్వాన్ని కోరిన కోర్టు
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (Electric Scooter) కు బీమా ఎందుకు తప్పనిసరి కాదో వివరిస్తూ ఢిల్లీ కోర్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోయింది. గతే రెండేళ్లలో ఇది దాదాపు రెట్టింపు స్థాయికి మించిపోయింది. ఫలితంగా, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు డిమాండ్ జోరందుకుంది. ప్రస్తుతం, భారతదేశంలో ప్రతి నెల జరిగే మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు దాదాపు 2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

భారతదేశంలో, ఓలా, హీరో ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మరియు ఒకినావా వంటి అనేక దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు తమ ద్విచక్ర వాహనాలను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తక్కువ వేగంతో నడిచే (లో-స్పీడ్) వాహనాలు, ఎక్కువ వేగంతో నడిచే (హై-స్పీడ్) వాహనాలు అని రెండు వర్గాలుగా విభజించారు. గంటకు 25 కి.మీ లేదా అంత కంటే తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను లో-స్పీడ్ వాహనాలు గాను మరియు గంటకు 25 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడిచే హై-స్పీడ్ వాహనాలుగా వర్గీకరించారు.

అయితే, గంటకు 25 కిమీ తక్కువ వేగంతో నడిచే వాహనాలను ఆర్టీఓ వద్ద రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు మరియు ఈ వాహనాలను నడపడానికి వయో పరిమితి, లైసెన్స్, రిజిస్ట్రేషన్, హెల్మెట్, ఇన్సూరెన్స్ వంటివి అవసరం లేదు. అయితే, వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని రిజిస్ట్రేషన్ నంబర్ ను పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వాహనాలకు గ్రీన్ కలర్ బోర్డుపై ఉండే నెంబర్ లభిస్తుంది. ఈ గ్రీన్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ ప్రింట్ చేసి వాహనం ముందు భాగంలో అతికించాలనే నిబంధనలు ఉన్నాయి.

అసలు విషయానికి వస్తే, భారతదేశంలో తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు బీమా తప్పనిసరి కాదు మరియు తక్కువ వేగంతో వెళ్లే స్కూటర్లకు హెల్మెట్ కూడా తప్పనిసరి కాదనే నిబంధన ఉంది. కాగా, ఇప్పుడు ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం తరఫు న్యాయవాది రజత్ కపూర్ ఓ కేసు దాఖలు చేశారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో వాటిని వినియోగించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో, దేశంలో బీమా అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా అలాంటి స్కూటర్ల వలన ఇతర వాహనాలు, వ్యక్తులు లేదా ఆస్తులకు నష్టం వాటిళ్లినా బాద్యులు ఎవరనేదానిపై స్పష్టత లేదు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల నాణ్యతపై కూడా ఎలాంటి నియంత్రణలు లేవు. ఫలితంగా, దేశంలో చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్న సంఘటనలు, ఈ ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలు నమోదవుతున్నాయి.

ఇలాంటి విపత్కర సంఘటనలు జరిగినప్పుడు కూడా సదరు ఎలక్ట్రిక్ వాహనాలకు బీమా లేకపోవడంతో లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు లో-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి కాదని చట్టం చెబుతోంది. అయితే, ఇలాంటి ద్విచక్ర వాహనాలను నడిపేవారు తక్కువ వేగంతో వెళ్తున్నప్పటికీ, ఇతరుల వలన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అటువంటి సందర్భాల్లో కూడా బీమా వర్తించకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి, టూవీలర్ సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని ద్విచక్ర వాహనాలకు హెల్మెట్లు తప్పనిసరి చేయబడాలి.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విపిన్ శంకి, జస్టిస్ నవీన్ చావ్లా సమక్షంలో ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర రోడ్డు రవాణా రమయు జాతీయ రహదారుల శాఖ, ఢిల్లీ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు పంపింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు బీమా ఎందుకు తప్పనిసరి చేయకూడదనే దానిపై వివరణ కోరింది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడం, బ్యాటరీలు పేలడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒకినావా, ఓలా మరియు ప్యూర్ ఈవీ వంటి కంపెనీలు తాము విక్రయించిన కొన్ని స్కూటర్లను రీకాల్ చేసి మళ్లీ పరీక్షిస్తున్నట్లు సమాచారం.

భారత్ లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విడుదల ఆగిపోనుందా?
ఇదిలా ఉంటే, దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అగ్నిప్రమాద ఘటనల నేపథ్యంలో వెంటనే ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది. కాగా, ఈ విషయంపై ఈవీ తయారీదారులతో ప్రభుత్వం నిర్వహించిన ఓ సమావేశంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆపుచేయాలని సమావేశం నుండి బయటకు వచ్చిన ఓ వ్యక్తి తెలిపారు. అయితే, అనంతరం తాము ఈ విషయంపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని, ఈవీ తయారీదారులు కొత్త వాహనాలను విడుదల చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.


Click it and Unblock the Notifications








