MotoGP అట్టహాసంగా ప్రారంభమైన మోటోజీపీ రేసింగ్.. ప్రపంచవేదికగా మరో చరిత్రను సృష్టించిన భారత్
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బైక్ రేసుల్లో ఒకటైన MotoGP గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ ఈ రోజు భారత్లో అట్టహాసంగా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా ఈ గ్రాండ్ రేసింగ్ ఈవెంట్కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు మూడు రోజుల పాటు గ్రాండ్గా జరిగే MotoGP Bharat Grand Prix అద్భుత క్షణాలకి భారత్ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(Buddh International Circuit)లో ఈ రేసు ఈ మూడు రోజులు గ్రాండ్గా జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏటా నిర్వహించే మోటోజీపీ గ్రాండ్ ప్రిక్స్ రేసులను ఈ ఏడాది భారత్లోనూ నిర్వహిస్తుండటం విశేషం. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ బైక్ రేసర్లు పాల్గొననున్నారు. మోటోజీపీ గ్రాండ్ ప్రిక్స్(MotoGP Grand Prix) ఈవెంట్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారత్లో ఫెయిర్ స్ట్రీట్ స్పోర్ట్స్(Fair Street Sports) ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తోంది. MotoGP Grand Prix ఈవెంట్ జరిగే ఈ 3 రోజుల్లో దాదాపుగా 1 లక్ష మందికి పైగా ఔత్సాహికులు గ్రేటర్ నోయిడాను సందర్శించనున్నారు. ఈ ఈవెంట్కి సంబంధించి టికెట్లు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
యమునా ఎక్స్ప్రెస్వేకి సమీపంలో ఉన్న BICలో ఒకేసారి 1,10,000 మంది కూర్చుని రేసింగ్ చూసే అవకాశం ఉంది. MotoGP గ్రాండ్ ప్రిక్స్ రేసులు సాధారణంగా వివిధ దేశాల్లో చాలా నెలల పాటు జరుగుతాయి. 2023 సంవత్సరానికి సంబంధించిన రేసులు గత మార్చిలో ప్రారంభమై వివిధ దేశాల్లో 6 నెలలుగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం MotoGP రేసును నిర్వహించే 13వ దేశంగా భారత్ నిలిచింది.

మొదటిరోజు రేస్ ట్రాక్ సర్క్యూట్లో రేసర్లకు ప్రాక్టీస్ రేసులు జరుగుతాయి. ఈ ప్రాక్టీస్ రేసుల ద్వారా, పోటీలో పాల్గొనే రేసర్లు బౌద్ధ రేసింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావొచ్చు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 23న క్వాలిఫయింగ్ రేసులు నిర్వహిస్తారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రేసర్లు, వారి టీమ్స్ సెప్టెంబర్ 24న జరిగే ఫైనల్ రౌండ్ రేసులకు అర్హత సాధిస్తాయి.
గతంలో ఫార్ములా 1 రేస్ 2011 మరియు 2013 మధ్య బుద్ధ్ ఇంటర్నేషనల్ రేస్ సర్క్యూట్లోనే నిర్వహించారు. ఈ ఏడాది MotoGP Bharat బైక్ రేస్ జరుగుతున్నందున దానికి అనుగుణంగా నిర్వాహకులు ట్రాక్ను సిద్ధం చేశారు. రైడర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ సర్క్యూట్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

గతంలో Buddh International Circuit లో ఫార్ములా 1 రేస్ జరిగినప్పుడు, ఇక్కడి ట్రాక్ 16 టర్నింగ్లతో ఉంది. కాగా MotoGP బైక్ రేస్ కావడంతో.. ట్రాక్ను కొద్దిగా సవరించారు. ఇప్పుడు ఈ సర్క్యూట్లో బైక్ రేస్కు అనుగుణంగా 13 మలుపులను ఏర్పాటు చేశారు. ఈవెంట్లో రేసర్లు కళ్లు చెదిరే వేగం అంటే గంటకు 370 కిలోమీటర్ల వేగంతో బైక్ను నడపగలరు.
3 కేటగిరీల్లో ఈ రేసు నిర్వహిస్తారు. MotoGP Bharat 2023 రేసులో 11 జట్ల నుంచి 22 మంది రైడర్లు MotoGP Title కోసం పోటీపడతారు. మోటో 2, మోటో 3 రేసులు కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా 40 కంటే ఎక్కువ జట్ల నుంచి 80 మంది రైడర్లు పాల్గొంటారని ఆర్గనైజర్స్ తెలిపారు.
డుకాటి, కేటిఎం, ఎప్రిలియా, యమహా వంటి ప్రధాన ఈవెంట్ టీమ్లు ఈ ఈవెంట్లో పాల్గొననున్నాయి. ప్రపంచంలోని ప్రముఖ బైక్ రేసర్లు అయిన ఫాబియో క్వార్టరారో(Fabio Quartararo), అలెక్స్ ఎస్పార్గారో(Aleix Espargaro) మరియు ఫ్రాన్సిస్కో బగ్నాయియా(Francesco Bagnaia) MotoGP భారత్ 2023 రేసుల్లో పాల్గొననున్నారు.
మోటోజీపీ రేస్ను ప్రత్యక్షంగా చూడలేని వారు Jio సినిమా, Sports18లో చూడవచ్చు. కాగా గత జూలైలో మోటోజీపీ రేస్ నిర్వాహకులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Sports Minister Anurag Thakur) కు హెల్మెట్ గిఫ్ట్గా ఇచ్చి ఈవెంట్కు ఆహ్వానించారు. ఈవెంట్లో భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ప్రమాదకరమైన వస్తువులను ప్రేక్షకులు తీసుకురావద్దని నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మోటోజీపీ భారత్ రేసింగ్ను వీక్షించేందుకు వచ్చే వారిని అలరించేందుకు ఒక్క రేసింగ్ పరంగానే కాకుండా అన్ని విధాలుగా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ సిద్ధంగా ఉంది. నోయిడాలో అత్యంత ఘనంగా ఇంటర్నేషనల్ ట్రేడ్ షో(International Trade Show) గురువారం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఇది కొనసాగనుంది.
భారత్లో ఫస్ట్ టైం జరగనున్న ఈ మెగా రేస్ ఈవెంట్ విజయవంతమైతే దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ మరింత పుంజుకోనుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగానూ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే చంద్రయాన్ 3, జీ20 సమ్మిట్లతో ఘన విజయంతో ప్రపంచం దృష్టి భారత్ వైపు ఉండగా.. MotoGP Bharat ఆ ఖాతాలో చేరనుంది.


Click it and Unblock the Notifications








