మూడేళ్లయినా ఏ మాత్రం తగ్గని ఏథర్ 450 ఇ స్కూటర్ బ్యాటరీ పర్ఫామెన్స్.. 70,000 కి.మీ నడిచినా అదే రేంజ్.!!
ఎలక్ట్రిక్ టూ వీలర్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారత మార్కెట్లో ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ కారణంగా అనేక బ్రాండ్లు సైతం మార్కెట్లోకి విస్తరించాయి. కానీ రైడర్లకు ఆందోళన కలిగించే ఒకే ఒక్క అంశం దాని బ్యాటరీ లైఫ్. ఎలక్ట్రిక్ వస్తువును వాడుతున్న కొద్దీ.. దాని బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంటుంది. కానీ ఏథర్ ఇ స్కూటర్ మూడేళ్లైనా దాని పనితీరులో మార్పు లేదు.
ఇ స్కూటర్లను ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థలు వివిధ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ప్రవేశపెడతాయి. కస్టమర్లకు దానిపై వారంటీని కూడా అందిస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ను వాడుతున్న కొద్దీ దాని బ్యాటరీ లైఫ్ క్షీణిస్తుంది. అందుకే కంపెనీలు వాటిపై వారంటీని ఇస్తాయి. కానీ ఇక్కడ Ather 450 Electric Scooter బ్యాటరీ మాత్రం మూడేళ్లయినా పాడైపోలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను యజమాని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ను కొనుగోలు చేసి మూడేళ్లయినా.. దాని బ్యాటరీ పనితీరుతో చాలా సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు స్కూటర్ యజమాని. ఆఫీసు పని దృష్ట్యా ఫీల్డ్ వర్క్, వ్యక్తిగత అవసరాల కోసం ఏథర్ 450 స్కూటర్ను దాదాపుగా 70,000 కి.మీ నడిపినా బ్యాటరీ లైఫ్ చెక్కుచెదరలేదని కితాబిస్తున్నారు. మూడేళ్లుగా నడిపిస్తున్న ఈ స్కూటర్తో తన అనుభవాన్ని పంచుకున్నారు యజమాని. రేంజ్, పనితీరును పరీక్షించారు.
ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని ఈ వీడియోను X(ట్విట్టర్) లో షేర్ చేశారు. ఈ వీడియో ఏథర్ సీఈవో తరుణ్ మెహతా దృష్టికి వెళ్లడంతో ఆయన దీనిని రీపోస్ట్ చేశారు. వీడియోలో రైడర్ ఈ స్కూటర్ రేంజ్ టెస్ట్ కోసం రైడ్కు తీసుకెళ్లారు. మూడేళ్లుగా దీనిని వాడుతున్నట్లు చెప్పారు. కాగా వీడియోను పరిశీలించినట్లయితే.. ఏథర్ స్కూటర్ బాడీ ప్యానెల్లు అరిగిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇంకా ORVM లు అరిగిపోయిన సంకేతాలను చూడవచ్చు. ఏథర్ 450 స్కూటర్ను చూస్తున్నట్లయితే పలు చోట్ల ప్రమాదాలకు కూడా గురైనట్లుగా తెలుస్తోంది. కాగా ఈ స్కూటర్ను యజమాని ఇప్పటికే 70,000 కి.మీ నడపగా.. ఈ స్కూటర్ రేంజ్ను పరీక్షించాలనుకుని టెస్ట్ రైడ్ చేశారు. ఇందుకోసం బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేశారు.

100 శాతం బ్యాటరీతో, స్కూటర్ ఎకో మోడ్లో 75 కి.మీ రేంజ్ను చూపించగా.. రైడ్ మోడ్కు మారినప్పుడు, రేంజ్ 65 కి.మీకి చూపించింది. ఇంకా స్పోర్ట్ మోడ్లో ఇది 55 కి.మీ ప్రదర్శించింది. అనంతరం రైడర్ ట్రిప్ మీటర్ను రీసెట్ చేసి, రైడ్ను ప్రారంభించారు. బెంగళూరు నగరం లోపల రైడ్ చేస్తుండటంతో ఎకో మోడ్కు మారారు.

బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయేవరకు స్కూటర్ను నడుపుతూ రేంజ్ను టెస్ట్ చేయడమే లక్ష్యంగా రైడర్ రైడ్ ప్రారంభించారు. బెంగళూరు ట్రాఫిక్లో కంపెనీ ప్రదర్శించిన రైడ్ కంటే ఒక కి.మీ ఎక్కువగానే అంటే మొత్తంగా 88.4 కి.మీ ప్రయాణించినట్లు రైడర్ గుర్తించారు. 70,000 కి.మీల వినియోగం తర్వాత ఏథర్ 450 బ్యాటరీ పనితీరుకు ఫిదా అవుతూ రైడర్ తెలిపారు.
ఈ పోస్ట్ అనంతరం తరుణ్ మెహతా తన పోస్ట్లో అదే వీడియోను పంచుకున్నారు. ఏథర్ 450 సిరీస్ స్కూటర్ పనితీరుపై కస్టమర్లకు విశ్వాసం పెరుగుతూనే ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు ఈ వీడియోనే ఉదాహరణ అని చెప్పారు. ఈ స్కూటర్ రీ సేల్ విలువ పెట్రోల్ స్కూటర్ల కంటే ఎక్కువగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








