ట్రయంఫ్ టైగర్ 900 బైకులు మరింత కొత్తగా వచ్చేశాయ్!.. ధర ఎంతో తెలుసా?
ట్రయంఫ్ మోటార్సైకిల్ ఇండియా (Triumph Motorcycle India) దేశీయ మార్కెట్లో అప్డేటెడ్ 'టైగర్ 900' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ బైక్ ధర, డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్, డెలివరీలను గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ట్రయంఫ్ కంపెనీ లాంచ్ చేసింది టైగర్ 900 బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి జీటీ వేరియంట్ మరియు ర్యాలీ ప్రో వేరియంట్. టైగర్ 900 జీటీ ధర రూ.13 95 లక్షలు (ఎక్స్ షోరూమ్).. కాగా, టైగర్ 900 ర్యాలీ ప్రో ధర రూ.15.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్స్ రెండూ కూడా మెరుగైన సామర్త్యాలను అందించడం మాత్రమే కాకుండా మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

ట్రయంఫ్ కంపెనీ ఈ బైకుల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది. టైగర్ 900 జీటీ బైక్ పేరుకు తగ్గట్టుగానే.. రోడ్ సెంట్రిక్ టూరింగ్ వైపు చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో టైగర్ 900 ర్యాలీ ప్రో ఎడిషన్ ఆఫ్ రోడింగ్ కోసం చాలా ఉపయోగపడుతుందని స్పష్టమవుతోంది. పనితీరు పరంగా రెండు బైకులు చాలా అద్భుతంగా ఉంటాయి.
డిజైన్ విషయానికి వస్తే.. టైగర్ 900 అప్డేటెడ్ మోడల్స్ రెండూ అగ్రెసివ్ అండ్ అడ్వెంచర్ డిజైన్ పొందుతాయి. లేటెస్ట్ పెయింట్ స్కీమ్ మరియు గ్రాఫిక్లతో పాటు బీక్, కాక్పిట్ మరియు సైడ్ కూడా కొంత రీడిజైన్ చేయబడ్డాయి. అంత కాకుండా అప్డేటెడ్ 20 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, అప్డేటెడ్ ప్లాటర్ సీటు వంటివన్నీ కూడా రైడర్ సౌకర్యాన్ని మరింత పెంచడంలో ఉపయోగపడతాయని కంపెనీ పేర్కొంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. ట్రయంఫ్ టైగర్ 900 బైక్ 888 సీసీ ఇన్ లైన్ ట్రిపుల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 9500 rpm వద్ద 106.5 Bhp పవర్ మరియు 6850 rpm వద్ద 90 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ పనితీరు మునుపటికంటే మెరుగ్గా ఉంటుందని సమాచారం. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. ఇంధన సామర్థ్యంలో కూడా మెరుగుదల ఉంటుందని తెలుస్తోంది.
ట్రయంఫ్ యొక్క టైగర్ 900 వేరియంట్లు బ్లూటూత్ కనెక్టిటివిటీతో కూడిన పెద్ద 7-ఇంచెస్ TFT స్క్రీన్ పొందుతాయి. రైడ్ బై వైర్ టెక్నాలజీ, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్ రోడ్ అనే నాలు రైడింగ్ మోడ్స్ పొందుతాయి. అయితే ర్యాలీ ప్రో బైక్ మాత్రం స్పెషల్ ఆఫ్ రోడ్ ప్రో మోడ్ పొందుతుంది. ఏబీఎస్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ కోల్పోతుంది.

రెండు బైకులు చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ర్యాలీ ప్రో స్టాండర్డ్ క్విక్ షిఫ్టర్ పొందుతుంది. ఇదే జీటీ వేరియంట్ నుంచి ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే.. టైగర్ 900 జీటీ వేరియంట్ ముందు భాగంలో 240 మిమీ USD పోర్క్, వెనుకవైపు 230 మిమీ షోవా మోనోషాక్ ఉన్నాయి. ఇవి కఠినమైన భూభాగాల్లో కూడా బైకును సజావుగా ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి.
దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టైగర్ 900 జీటీ బైక్ డుకాటీ మల్టిస్ట్రాడా వీ2కు ప్రత్యర్థిగా ఉంటుంది. అదే సమయంలో టైగర్ 900 ర్యాలీ ప్రో డుకాటీ డెసర్ట్ఎక్స్, సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ, బీఎండబ్ల్యూ ఎఫ్ 850 జీఎస్ అడ్వెంచర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాలి ఉంటుందా? లేక మంచి అమ్మకాలను పొందుతుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








