ఈ బైక్పై 130 కి.మీలు వెళ్లడానికి కేవలం రూ.20 సరిపోద్ది.. TVS XLలాగా పెద్ద బరువును సైతం మోయగలదు..
భారత్ క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా అలవాటు పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఆటో మొబైల్ తయారీ దారులు కూడా తమ ధోరణిని మార్చుకుని పెట్రోల్, డీజిల్ వాహనాలనే కాకుండా ఈవీలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని కంపెనీలు కూడా లేటెస్ట్ ఫీచర్లు, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో కొత్త ఈవీ స్కూటర్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఇదే బాటలో తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ (Gravton Motors Pvt Ltd) కొత్తగా క్వాంటా (quanta) అనే ఈవీ టూవీలర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో అనేక ఫీచర్లను అందించారు. ఇది చూడటానికి అచ్చం TVS XL లాంటి డిజైన్తో మోపెడ్-రకం లాగా కనిపిస్తుంది.
గతంలో గ్రావ్టన్ క్వాంటా ఎలక్ట్రిక్ బైక్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. కంపెనీ సభ్యులు దీన్ని కన్యాకుమారి నుంచి ఖర్దుంగ్ లా వరకు మొత్తం 4,011 కిలోమీటర్ల దూరం బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి ఆపకుండా నడిపారు. ఈ మైలురాయితో ఈ బైక్ 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది. ఇంత దూరాన్ని కవర్ చేయడానికి 6.5 రోజులు పట్టింది, అనగా 164 గంటల 30 నిమిషాల సమయం.

ఈ రైడ్ను సెప్టెంబర్ 2021లో పూర్తి చేశారు. ముఖ్యవిషయం ఏమిటంటే, బైక్ను దారి మధ్యలో ఛార్జింగ్ కోసం ఆపకుండా కేవలం బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన ప్రతిసారి మరో పూర్తి ఛార్జింగ్ కలిగిన బ్యాటరీని అమర్చేవారు. ఇలా మార్చుకుంటూ రైడ్ను పూర్తి చేశారు. ఇంతటి ఘనతను సాధించిన క్వాంటా ఎలక్ట్రిక్ బైకును కంపెనీ రూ.1.2 లక్షలకు ఇప్పుడు వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది ఈవీ బైక్ అయినప్పటికి ఎక్కువ బరువును సైతం సునాయాసంగా మోసుకెళ్లగలదు. అధిక లోడింగ్ కెపాసిటీతో ఇది 265 కిలోల వరకు బరువును మోయగలదని కంపెనీ పేర్కొంటుంది. ఇండియాలో అత్యంత ఫేమస్ మోడల్ అయినటువంటి TVS XL ఎంతటి బరువునైనా కూడా సులభంగా మోయగలదు, ఇప్పుడు అదే రూపంతో ఉన్నటువంటి క్వాంటా కూడా అధిక లోడింగ్ కెపాసిటీతో వచ్చింది.

గ్రావ్టన్ మోటార్స్ నుంచి వచ్చిన క్వాంటా ఎలక్ట్రిక్ బైక్లో శక్తివంతమైన BLDC మోటార్ను ఏర్పాటు చేశారు. ఇది 3 kW పవర్ను, 172NM టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్లో 2.78 kWh లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ లాంటి బ్యాటరీని అమర్చారు. ఈ బ్యాటరీ ఆప్షన్ను కలిగిన మొదటి మోడల్గా నిలిచింది. ఇది పూర్తి ఛార్జింగ్తో 130 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
క్వాంటా ఎలక్ట్రిక్ బైక్లో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని ఇచ్చారు. ఇది 90 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. దీంతో పాటు వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉండటానికి బ్యాటరీ మార్చుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంతో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయిన ప్రతిసారి ఛార్జింగ్ స్టేషన్ల వద్దకు వెళ్లి అప్పటికే పూర్తిగా ఛార్జింగ్ కలిగిన బ్యాటరీలను బైకులో అమర్చి పాత దాన్ని అక్కడే ఇచ్చేయొచ్చు.

ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 2.7 యూనిట్ల కరెంట్ మాత్రమే అవసరం అవుతుంది. అంటే 130 కి.మీ దూరం ప్రయాణించడానికి దాదాపు రూ. 20 లు మాత్రమే ఖర్చు కానుంది. అదే సాధారణ ఇంధన వాహనాలతో ఇంత దూరం ప్రయాణించాలంటే దాదాపు రూ.250 ఖర్చు చేయాల్సి ఉంటుంది. లోకల్ ప్రయాణాలకు, రోజువారీ పనులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








