2 ఇన్ 1 వెహికిల్, 'స్కూటర్+ ఆటో రిక్షా' రెండిటిలా ఉపయోగించవచ్చు.. కేవలం 3 నిమిషాల్లో వేరు చేయవచ్చు!
టూవీలర్స్ అమ్మకాల్లో హీరోమోటోకార్ప్ టాప్లో కొనసాగుతుంది. గత రెండు దశాబ్దాలుగా ఈ కంపెనీకి చెందిన టూవీలర్స్ మార్కెట్లో తిరుగులేని శక్తిగా అవతరించాయి. ఇతర కంపెనీలు దీని దరిదాపుల్లోకి రావడం లేదు. దీనిని బీట్ చేసేందుకు ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న హోండా మోటార్ సైకిల్స్ ఇండియా తీవ్రంగా చెమటోడుస్తోంది. అయినా కానీ దీనిని అమ్మకాల్లో ఢీ కొట్టలేక పోతుంది. ఈ సంస్థ నుంచి సరసమైన ధరలో స్కూటర్లు, మోటార్సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది సరికొత్త వెహికిల్ని తీసుకువస్తున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. అదే ఎలక్ట్రిక్ స్కూటర్+ఆటోరిక్షా. ఇదొక 2 ఇన్ 1 వెహికిల్లా పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హీరో టీజర్ని సైతం విడుదల చేసింది.
ప్రపంచంలో ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అందుకు తగినట్లుగానే సీఎన్జీ, ఎలక్ట్రిక్, సాంప్రదాయ ఇంధన వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ప్రతీ సెగ్మెంట్లో కింగ్ మేకర్గా ఉండేలా హీరో మోటాకార్ప్ టూ ఇన్ వన్ ఎలక్ట్రిక్ వెహికిల్ని రూపకల్పన చేసింది. దీనినే సర్జ్ S32 (Surge S32) గా పిలుస్తున్నారు. పైన చెప్పిన విధంగా ఇది రెండు విధాలుగా (స్కూటర్, ఆటోరిక్షా) పని చేస్తుంది. దీనిని కేవలం మూడు నిమిషాల్లో త్రీవీలర్ నుంచి టూవీలర్గా మార్చుకోవచ్చు.

ఇదొక వైవిధ్యం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్ ఆటోరిక్షాగా పిలువబడుతుంది. త్రీవీలర్ మోడ్లో భారీ సరుకులను సైతం ఇది మోసుకెళ్లగలదు. కేవలం దీని కాన్సెప్ట్ని మాత్రమే హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలేవీ అందుబాటులో రాలేదు. ఈ సరికొత్త సర్జ్ వెహికిల్ 2025 లోపు మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
విడుదల తర్వాత దీనికి వచ్చే డిమాండ్ని బట్టి సంవత్సరానికి కనీసం 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసే యోచనలో కంపెనీ ఉంది. అయితే దీని రిజిస్ట్రేషన్ కోసం కొన్ని చిక్కులు ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ టూ ఇన్ వన్ వెహికిల్ని లైట్ మోటార్ వెహికిల్ 2/ లైట్ మోటార్ వెహికిల్ 5 కేటగిరీలో చేర్చేందుకు హీరో ప్రభుత్వానికి అభ్యర్ధన పెట్టుకుంది. అన్ని పర్మిషన్స్ వస్తే త్వరలోనే ఈ వెహికిల్ కూడా రిజస్టర్డ్ వెహికిల్స్ లిస్ట్లో చేరనుంది.

దీని రిజిస్ట్రేషన్ ఇతర అనుమతుల కోసం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఒక వాహన తయారీ సంస్థ ఇలాంటి వినూత్న ఆలోచనతో భారత్లో కొత్త తరహా వెహికిల్స్ని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దీనిని "క్లాస్ షిఫ్టింగ్ వెహికల్"గా కూడా హీరో పిలుస్తోంది. ఇది సక్సెస్ అయితే ఇతర కంపెనీలు సైతం దీనిని కాపీ కొట్టే అవకాశం ఉంటుంది.
ఈ వెహికిల్ని కేవలం 3 నిమిషాల్లో వేరు చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వ్యాపార అవసరాల కోసం చూస్తున్న వారికి సరిపోతుంది. సర్జ్ S 32 అడాప్టివ్ కంట్రోల్స్తో వస్తుంది. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనిని వేరు చేయవచ్చు. 3 వీలర్లో ఫ్రంట్ ప్యాసింజర్ క్యాబిన్, ఆటో విండ్ స్క్రీన్, హెడ్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు, వైపర్స్ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి.

కానీ ఇందులో డోర్లు లేవు. ఇది కాస్త నిరాశకు గురిచేయవచ్చు. ఆ తర్వాతి వెర్షన్లో లేదా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి అందుబాటులో తెచ్చే సమయంలో డోర్లను సైతం జోడించే అవకాశం లేకపోదు. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ స్కూటర్లోని 3.87 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 6 kWh మోటారుతో పనిచేయనుంది. ఇది గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లు, త్రీవీలర్ 10 kWh మోటారుతో గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








