యూత్ని ఆకట్టుకునే సరికొత్త బైక్ లాంచ్.. రాయల్ ఎన్ఫీల్డ్కి ఏమాత్రం తీసిపోదు
జావా యెజ్డీ బెస్ట్ ఫర్ఫామెన్స్ క్లాసిక్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఆ బైక్ కంపెనీ జావా 42 బాబర్ మోడల్లో సరికొత్త 'రెడ్ షీన్' వేరియంట్ని విడుదల చేసింది. ఈ మోటార్ సైకిల్ కొత్త కలర్ స్కీమ్ మరియు అల్లాయ్ వీల్స్ వంటి కొన్ని ఇతర డిజైన్ మార్పులతో మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ముంబైలో జరిగిన All You Can Street (AYCS) ఫెస్టివల్లో ఈ బైక్ని సంస్థ విడుదల చేసింది. ఈ బైక్ పేరుకి తగినట్లుగా రెడ్ షీన్ డ్యూయల్ టోన్ కలర్ రెడ్ మరియు క్రోమ్లలో వస్తుంది. బైక్ లోయర్ బాడీ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ట్యూబ్ లెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ని గమనించవచ్చు. పూర్తిగా ప్రీమియం బైక్ లుక్లో రెడ్ షీన్ అదరగొట్టనుంది.

జావా యెజ్డీ 42 బాబర్ రెడ్ షీన్ 334 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ బైక్ ఫర్ఫామెన్స్ పరంగా చూస్తే 29.5 bhp మరియు 30 nm టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్తో జతచేయబడి ఉంది. అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్తో అందించబడుతుంది.
ఈ బైక్లో ఇతర ప్రొడక్ట్స్ కంటే మరిన్ని స్మార్ట్ ఫీచర్లను సైతం కంపెనీ జోడించింది. 7 స్టెప్స్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనో-షాక్, టూ-స్టెప్ అడ్జస్టబుల్ సీటు, USB ఛార్జింగ్ పోర్ట్, డిజిటల్ కన్సోల్, ఫుల్ LED లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు రైడర్కి బెస్ట్ రైడింగ్ అనుభూతిని అందిచనున్నాయి. ఈ బైక్ విడుదలైనప్పటి నుంచి విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ మోటార్ సైకిల్ ధర రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ఇది బ్లాక్ మిర్రర్ ఎడిషన్తో వేరియంట్ లైనప్తో పాటు అధిక ధర కలిగిన బైక్గా ఉంది. ఈ రెడ్ షీన్ వేరియంట్ జాస్పర్ రెడ్ వేరియంట్ కంటే రూ .9,550 ఖరీదైనది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాక దీని డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
యువత ఎక్కువగా ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో జావా 42 బాబర్ రెడ్ షీన్ని తీసుకువచ్చింది. మార్కెట్లో ఈ బైక్లకు మంచి డిమాండ్ లభిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇటీవల రిఫ్రెష్ చేయబడిన జావా పెరాక్, జావా 42 బాబర్తో పాటు, జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ కోసం ప్రస్తుత 'ఫ్యాక్టరీ కస్టమ్' పోర్ట్ ఫోలియోను నెలకొల్పింది.

ప్రస్తుతం జావా 350, జావా 42, యెజ్డీ రోడ్ స్టర్, యెజ్డీ స్క్రాంబ్లర్ మరియు యెజ్డీ అడ్వెంచర్లు ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్నాయి. జావా 42 బాబర్ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో దానికి కొనసాగింపుగా రెడ్ షీన్ని పరిచయం చేసినట్లు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సీఈవో ఆశిష్ సింగ్ జోషి తెలిపారు. మార్కెట్లో తమ వాటాను మరింత విస్తరించేందుకు రెడ్ షీన్ కలిసి వస్తుందని చెప్పారు.
ఈ వేరియంట్ బాబర్ సెగ్మెంట్ విభాగానికి టాప్లో నిలుస్తుందని తెలిపారు. రైడింగ్ పట్ల అవగాహనతో పాటు దానిపై మక్కువ పెంచే సంస్కృతిని పెంపొందించడానికి జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందుకే All You Can Street (AYCS) ఫెస్టివల్లో ఈ బైక్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వెళ్లడించారు. భవిష్యత్తులోనూ మంచి ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications








