దేశంలో మీరు ఎక్కడ ఉన్నా, ఓలా ఈవీ స్కూటర్లు మీ వద్దకే.. ప్రతి నగరానికి, గ్రామానికి వచ్చేశాయి
రైడ్ షేరింగ్ సంస్థగా మొదలై ఇండియాలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్(Electric) టూవీలర్ల తయారీ కంపెనీగా ఎదిగిన బెంగళూరుకు చెందిన ప్రముఖ ఈవీ(Ev) సంస్థ ఓలా ఎలక్ట్రిక్(Ola electric) భారత ఈవీ మార్కెట్లో టూవీలర్ విభాగంలో ఇతర కంపెనీల కంటే మెజారిటీ వాటాతో దూసుకుపోతుంది. కంపెనీ ప్రతి ఏడాది అధునాతన ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లను విడుదల చేస్తూ, వినియోగదారులకు బడ్జెట్ ధరలో తన ఉత్పత్తులను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ఓలా వాహనాలు కనిపిస్తున్నాయి. అయితే ఓలా స్కూటర్లలో పలు సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చినప్పటికి కూడా వాటన్నింటిని అధిగమిస్తూ వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కల్పించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండటానికి తన నెట్వర్క్ను భారీగా విస్తరించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టోర్లను క్రమంగా ఓపెన్ చేస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం క్రమంగా పెరుగుతున్న డిమాండ్ను గుర్తించి సేల్స్ను పెంచుకోడానికి దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా 3,200 స్టోర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెంటర్లలో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను సేల్ చేయడమే కాకుండా సర్వీసింగ్ కూడా చేస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి 800 స్టోర్లకు అదనంగా ఈ కొత్త 3,200 తో మొత్తం ఓలా ఎలక్ట్రిక్కు దేశంలో 4,000 స్టోర్లు ఉన్నాయి.

కంపెనీ అతితక్కువ కాలంలోనే తన స్టోర్లను ఈ రేంజ్లో విస్తరించడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో కూడా కొన్ని ఈవీ తయారీ కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మార్కెట్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఓలా ముఖ్యమైన మైలురాయి సాధించింది. డిసెంబర్ 2 నాటికి దేశవ్యాప్తంగా ఓలా కంపెనీకి 800 స్టోర్లు ఉన్నాయి, వాటిని నాలుగు రెట్లు విస్తరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇంతకుముందు ప్రకటించారు.
ఇలా ఆయన నుంచి ప్రకటన వచ్చిన 19 రోజుల్లోనే కొత్త స్టోర్లను ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాలు, కొన్ని మండల ఏరియాల్లో కూడా ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మండల ప్రాంతాల్లో కూడా స్టోర్లను ఓపెన్ చేయడం వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా కొత్త కస్టమర్లు రావడానికి అనువుగా ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ప్రారంభించిన వాటిలో ఎక్కువగా గ్రామీణ మార్కెట్కు దగ్గరగా ఉన్నాయి. ప్రధాన నగరాలపై గతంలోనే పట్టు సాధించిన కంపెనీ ఇప్పుడు గ్రామాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా ఇండియాలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ భారీగా పుంజుకుంటాయి. ఇటీవల ఓలా బ్యాటరీలు పేలిపోవడం, స్కూటర్లు రోడ్డు మధ్యలో ఆగిపోవడం, సర్వీస్ సెంటర్ సిబ్బంది సరిగ్గా పట్టించుకోకపోవడం వంటి పలు ఫిర్యాదులు కంపెనీకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో వాటన్నింటికి చెక్ పెట్టడానికి ప్రజల్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై పూర్తి స్థాయిలో నమ్మకం రావడానికి కొత్తగా ప్రారంభించిన స్టోర్లు చాలా కీలకం కానున్నాయి. ప్రజలకు అందుబాటులో సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కంపెనీ ఉత్పత్తులపై నమ్మకం పెరిగి, సేల్స్ మరింత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆగస్టులో ఐపీఓకు వచ్చిన తర్వాత వినియోగదారుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
దీంతో ఆ తర్వాత సేల్స్ కొంత వరకు ప్రభావితం అయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ వాహనాల నాణ్యత సరిగ్గా లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణం అయింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాదిలో భారత ఈవీ టూవీలర్ మార్కెట్లో ఇతర బ్రాండ్ల కంటే సేల్స్ పరంగా మొదటి స్థానంలో నిలవడానికి ఓలా ఎలక్ట్రిక్ భారీ స్థాయిలో స్టోర్లను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








