మీ ఫేవరెట్ స్కూటర్ ఇకపై CNG వెర్షన్లో రాబోతుంది.. ప్రపంచంలో ఇదే తొలి సీఎన్జీ స్కూటర్!
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపూ చూస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో సీఎన్జీ బైక్, ఎల్పీజీ కిట్తో నడిచే బైక్స్, హైడ్రోజన్ బైక్స్ అనేవి మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నెలలో (జూలై 5)న ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ని ఫ్రీడమ్ 125 (Freedom 125) బైక్ని విడుదల చేసింది. ఈ బైక్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన మార్క్ ముద్రను వేసింది. ఈ బైక్ తయారీలో బజాజ్ తీసుకున్న చర్యలను అందరూ మెచ్చుకుంటున్నారు. అంతే కాకుండా అందరికీ అందుబాటు ధరలో కేవలు రూ.95,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ బైక్ని బజాజ్ విడుదల చేసింది.
ఇప్పుడు ఈ బైక్కి పోటీగా త్వరలో స్కూటర్ని సీఎన్జీ రూపంలో తీసుకువచ్చేందుకు టీవీఎస్ కసరత్తు చేస్తున్నట్లు 'ఆటోకార్ వెబ్సైట్' వెల్లడించింది. బజాజ్ ఆటోకు పోటీగా సీఎన్జీ మార్కెట్ని శాసించేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ సరికొత్త స్కూటర్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదించింది. ఆ కంపెనీ తన పాపులర్ జూపిటర్ స్కూటర్ మోడల్లో ఈ సీఎన్జీ ఆప్షన్ని ప్రవేశపెట్టనుంది.

పూర్తి స్థాయిలో ఈ స్కూటర్ అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే తొలి సీఎన్జీ స్కూటర్గా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే తొలి స్కూటర్ని అభివృద్ధి చేసిన మొదటి కంపెనీగా టీవీఎస్ మోటార్ కంపెనీ నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ స్కూటర్ ఉత్పత్తిపై టీవీఎస్ అధికారిక సమాచారాన్ని వెల్లడించనుంది. ఆటోకార్ నివేదిక ప్రకారం టీవీఎస్ మోటార్ కంపెనీ చాలా కాలంగా ప్రత్యామ్నాయ ఇంధన టూవీలర్స్పై పనిచేస్తోందని పేర్కొంది.
కంపెనీ ప్లాంట్లో ఇప్పటికే సీఎన్జీతో నడిచే వాహనాల కోసం మోటార్ల తయారీని కూడా ప్రారంభించినట్లు నివేదిక తెలిపింది. కంపెనీ పాపులర్ స్కూటర్ మోడల్ జూపిటర్లో ఈ సీఎన్జీ పవర్ట్రెయిన్ని అందించడం ద్వారా మంచి బిజినెస్ సాధ్యపడుతుందని టీవీఎస్ యోచిస్తోంది. త్వరలో రాబోయే ఈ సీఎన్జీ స్కూటర్కి U740 అనే కోడ్నేమ్ని పెట్టారు. ఇది 125 సీసీ ఇంజిన్తో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ స్కూటర్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ఉత్పత్తి ప్రయోగాలను హోసూర్లోని ప్లాంట్లో తయారు చేయాలని భావిస్తున్నారు. టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. ప్రస్తుతం టూ వీలర్ విభాగంలో ఆ కంపెనీ దాదాపు 18 శాతం వాటాను కలిగి ఉంది.
దేశంలో ఈ కంపెనీకి చెందిన టూవీలర్స్ ఇప్పటివరకు 3.15 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్ని విడుదల చేయడానికి ఈ కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్కి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బజాజ్ ఫ్రీడమ్ 125 భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో సీఎన్జీ ఆధారిత ఫీచర్లతో అందుబాటులో ఉంది.

ఈ బైక్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2 కిలోల సీఎన్జీ కిట్ 213 కిలోమీటర్లు, రెండు లీటర్ల పెట్రోల్ కెపాసిటీ కలిగిన ట్యాంక్ 117 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ పూర్తిగా 330 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇక త్వరలో రానున్న జూపిటర్ సీఎన్జీ ఈ బైక్ కంటే కొంచెం ఖరీదైనదిగా ఉండనుంది.
టీవీఎస్ సీఎన్జీ ఆధారిత వాహనాలు పర్యావరణ హితంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాదిరిగానే త్వరలోనూ సీఎన్జీ వాహనాల ఉత్పత్తిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహించే అవకాశం ఉంది. దేశంలో ఇప్పటి వరకు సాంప్రదాయ పెట్రోల్ బైక్స్ని మాత్రమే జనాలు వినియోగిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్, సీఎన్జీ బైక్స్ వైపు చూసే అవకాశం ఉంటుదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్ వెహికిల్స్ ధరతో పోలిస్తే వీటి ధర తక్కువగా ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications








