జనవరి 2026 నుండి బైక్ రూల్స్ మారనున్నాయి.. ప్రతి బైక్కి ABS, ఇకపై రెండు హెల్మెట్లు తప్పనిసరి!
భారతదేశ రోడ్లపై భద్రతను మరింత మెరుగుపరచే దిశగా మరో కీలకమైన అడుగు పడింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం, 2026 జనవరి 1వ తేదీ నుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త టూవీలర్స్.. అవి స్కూటర్లు కావొచ్చు లేదా బైకులు కావొచ్చు, ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) కలిగి ఉండటం తప్పనిసరి కానుంది, దీనిని టైమ్స్ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాం. ఇది కేవలం ఒక నిబంధన మాత్రమే కాక, భారత రోడ్లపై రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదాలను నియంత్రించేందుకు తీసుకున్న చొరవగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు 125cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన టూవీలర్ వాహనాలకు మాత్రమే ABS తప్పనిసరి అయిందని చూస్తే, కొత్త నియమంతో అన్ని వాహనాల్లో ఇది వర్తించనుంది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా స్కూటర్ నుంచి శక్తివంతమైన స్పోర్ట్బైక్ వరకు ప్రతి వాహనదారుడి భద్రతను గణనీయంగా మెరుగుపరచనుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వాహనాన్ని బ్రేక్ వేస్తున్నప్పుడు టైర్లు లాక్ అయ్యే పరిస్థితిని నివారించి, వాహనం అదుపుతప్పకుండా నిలిపేలా సహాయపడుతుంది. నీళ్లతో తడిగా మారిన రోడ్లు, అకస్మాత్తుగా బ్రేక్ వేసే పరిస్థితులలో ప్రయాణికులను ప్రమాదాల నుండి కాపాడుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులు, రోడ్డు మౌలిక వసతుల దృష్ట్యా కీలకం.

ఈ కొత్త నిబంధన వాహన తయారీదారులపై కొంత అదనపు ఖర్చులను మోపే అవకాశమున్నా, దీని ద్వారా ప్రయాణికులకు వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ తరాలకు మరింత సేఫ్టీతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు ఇది సానుకూలమైన మార్గం. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయడం అనేది భారత రోడ్డు భద్రతా చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది ప్రాణాలను రక్షించే మార్గంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది చెబుతోంది.
భారతదేశంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ దాదాపు 40 శాతం టూవీలర్ వాహనాలు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) లేకుండా రోడ్డుపై పరుగులు తీస్తున్నాయి. ఇది తక్కువగా అనిపించినా, ప్రమాదాల సమయంలో దాని ప్రభావం మాత్రం అత్యంత తీవ్రంగా ఉంటుంది. రైడర్ ఒకేసారి, అత్యవసరంగా లేదా బలవంతంగా బ్రేకులు వేయాల్సిన పరిస్థితుల్లో, టైర్లు లాక్ అవ్వడం వల్ల వాహనం జారిపోతే నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఇలాంటి సమయంలో ABS కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టైర్లను లాక్ కాకుండా కాపాడుతుంది, వాహనంపై నియంత్రణ కొనసాగించే అవకాశాన్ని పెంచుతుంది, దాంతో పాటు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది సాధారణంగా మూడు ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది, టైర్లు ఎంత వేగంగా తిరుగుతున్నాయో నిరంతరం గమనించడానికి స్పీడ్ సెన్సార్లు, టైర్ల లాక్ అవుతున్న సంకేతాలను గుర్తించి స్పందించడానికి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) ఉంటుంది.
అలాగే బ్రేకింగ్ ప్రెషర్ను సరిగ్గా కంట్రోల్ చేయడానికి హైడ్రాలిక్ వాల్వులు, పంపులు ఉంటాయి. ఈ టెక్నాలజీ మైక్రో సెకన్లలో టైర్ పరిస్థితిని విశ్లేషించి, అవసరమైతే ఒక్కో చక్రానికి ప్రత్యేకంగా బ్రేకింగ్ ప్రెషర్ను వర్తింపజేసి వాహనం సురక్షితంగా నిలిచేలా చేస్తుంది. ప్రస్తుతం టూవీలర్ వాహనాల్లో ABS రెండు రూపాలలో , సింగిల్ ఛానల్ ABS ముందు చక్రానికి, డ్యూయల్ ఛానల్ ABS ముందు, వెనుక రెండింటికీ విడివిడిగా పని చేస్తుంది.

అయితే, కొత్త నిబంధనల ప్రకారం వీటిలో ఏదిని తప్పనిసరిగా అమలు చేయాలనుకుంటున్నారో ఇప్పటికీ స్పష్టత లేదు. ముఖ్యంగా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండటాన్ని ఒక ముఖ్య అవసరంగా పరిగణించాలి. పరిశోధనలు చెబుతున్నట్లుగా, ABS ఉన్న వాహనాల్లో ప్రమాదాల సంభావ్యత 35% నుండి 45% వరకూ తగ్గుతుంది.
భారత ప్రభుత్వం టూవీలర్ ప్రయాణికుల భద్రత పట్ల తీసుకుంటున్న చర్యల్లో మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. ప్రస్తుతం కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేసినప్పుడు వాహన తయారీదారులు ఒకే హెల్మెట్ను అందిస్తుంటే, ఇకపై ప్రభుత్వం నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. జనవరి 1, 2026 నుండి అందుబాటులోకి రానున్న ఈ మార్గదర్శకత్వం ప్రకారం, ప్రతి కొత్త టూవీలర్తో పాటు రెండు BIS సర్టిఫైడ్ హెల్మెట్లు అందించనున్నారు.
ఇప్పటివరకు ప్రధానంగా డ్రైవర్కు మాత్రమే హెల్మెట్ అందించడమే పరిపాటి కాగా, ఈ కొత్త నిబంధనతో రైడర్తో పాటు పిలియన్ రైడర్ భద్రత కూడా పటిష్టమవుతుంది. BIS సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్లు నాణ్యత ప్రమాణాలను పాటించినవిగా గుర్తించబడతాయి. మొత్తంగా ABS వంటి సాంకేతిక భద్రతా లక్షణాలతో పాటు, రెండు BIS సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరి చేయడం, భారత రోడ్లపై ప్రయాణించే ప్రతి టూవీలర్ వాహనదారుని మరింత సురక్షితంగా ఉంచడం ప్రభుత్వ ఉద్దేశం.


Click it and Unblock the Notifications








