ఓలాకు షాక్.. సింగిల్ ఛార్జ్ పై 161కిమీ రేంజ్.. తక్కువ ధరలో ఏథర్ కొత్త స్కూటర్
ఏథర్ ఎనర్జీ భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్తో పోటీ పడుతూ, మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. తాజాగా పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అన్న నినాదంతో కొత్త ఏథర్ 450S 3.7 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. అధిక రేంజ్, మెరుగైన పనితీరు, సరసమైన ధరతో వచ్చిన ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారతీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ దూకుడు పెంచుతోంది. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. ఏథర్ మాత్రం ఓలాకు గట్టి పోటీ ఇస్తూ, మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. జూలై చివరి నాటికి ఓలా మార్కెట్ వాటా 17.2% కాగా, ఏథర్ 16.5% మార్కెట్ వాటాతో వెనుకే ఉంది. కేవలం 526 యూనిట్ల తేడాతో ఏథర్, ఓలాకు దగ్గరగా ఉంది.

పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఏథర్ కొత్త ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. ఈ స్కూటర్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఎక్కువ రేంజ్, మెరుగైన పనితీరు, సరసమైన ధర కావాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త వేరియంట్ను రూపొందించారు. పూర్తి ఛార్జ్పై ఇది 161 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తుంది.
ఈ 450S వేరియంట్తో ఏథర్ ఎంట్రీ-లెవల్ స్కూటర్లు, ప్రీమియం మోడళ్ల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలని చూస్తోంది. మార్కెట్లో ఎక్కువ రేంజ్, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనే డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త స్కూటర్ను తీసుకొచ్చామని ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవినిత్ ఫోకేలా అన్నారు.
కొత్త 450S స్కూటర్ అందించే 161 కి.మీ. రేంజ్తో రైడర్లు సుదీర్ఘ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చని, అలాగే ఏథర్ 450 సిరీస్ ఉత్సాహభరితమైన పనితీరును తక్కువ ధరలో అనుభవించవచ్చని ఆయన తెలిపారు.

ఏథర్ 450S స్కూటర్కు 3.7 kWh బ్యాటరీ ప్యాక్, 5.4 kW మోటార్ ఉన్నాయి. ఇది 22 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.9 సెకన్లలో 0 నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఇందులో స్మార్ట్ ఈకో, ఈకో, రైడ్, స్పోర్ట్ అనే నాలుగు రైడ్ మోడ్లు ఉన్నాయి.
ఇతర ఫీచర్లలో 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ వంటివి ఉన్నాయి. ఆటోహోల్డ్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆటో ఇండికేటర్ కట్-ఆఫ్, దొంగతనం అలర్ట్లు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఏథర్ స్కూటర్ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉన్న 3,300కు పైగా ఏథర్ ఛార్జింగ్ పాయింట్ల ప్రయోజనం లభిస్తుంది. ఇంట్లో 4.5 గంటల్లో బ్యాటరీ 0-80% వరకు ఛార్జ్ అవుతుంది. ఏథర్ ఎయిట్70 వారంటీ ప్రోగ్రామ్ కింద, 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు రక్షణ లభిస్తుంది. ఈ వారంటీ కింద 70% బ్యాటరీ హెల్త్ ఉంటుంది.
ఈ స్కూటర్ ధర నగరాలను బట్టి మారుతుంది. బెంగళూరులో రూ.1,45,999, ఢిల్లీలో రూ.1,48,047, ముంబైలో రూ.1,48,258, చెన్నైలో రూ.1,47,312(ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు కస్టమర్లు ఏథర్ షోరూమ్ల నుండి లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు. 2025 ఆగస్టు నుండి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








