Auto Expo 2025 - Bajaj : ఆటో ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా బజాజ్.. ఇథనాల్, ఎలక్ట్రిక్ బైకులు.. తగ్గేదేలే!
ఆటోమొబైల్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ప్రారంభం కావడానికి మరికొన్ని ఘడియలే మిగిలి ఉంది. అనేక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు.. ఈ ఎక్స్పోలో తమ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ కూడా.. 'తగ్గేదేలే' అంటోంది. ఈసారి ఆ సంస్థ.. తమ బ్రాండ్ నుంచి సరికొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. దేశమంతా ప్రస్తుతం.. సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. బజాజ్ సంస్థ కూడా అందులో భాగం కావాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇథనాల్తో నడిచే మరో వాహనాన్ని కూడా ఈ ఎక్స్ పోలో పరిచయం చేయనుంది. దాంతోపాటు ఇటీవలే వినియోగదారుల ముందుకు తెచ్చిన.. చేతక్ 35 సిరీస్ తోనూ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.
చేతక్ 35 సిరీస్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఎలక్ట్రిక్ వాహనాలలో.. 3501, 3502, 3503 అనే మూడు వేరియంట్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో వీటికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనుంది బజాజ్ సంస్థ. ఇందులో మొదటి రెండు మోడళ్ల ధరను ఇదివరకే వెల్లడించినప్పటికీ.. ఇందులో టాప్ ఎండ్ వీరియంట్ ధరను మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంచింది.

రాబోయే రోజుల్లో బజాజ్ నుంచి దీనిపై ప్రకటన వెలువడుతుందో లేదో వేచి చూడాలి. 35 సిరీస్ అనేది బజాజ్ చేతక్ EVకి సంబంధించి అత్యంత ఫీచర్-రిచ్ మోడల్ అని చెప్పవచ్చు. దీన్ని కొత్త ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఇందులో వినియోగించిన సాంకేతికత, పర్ఫార్మెన్స్ కారణంగా.. ఇంతకుముందు తీసుకువచ్చిన వాహనాల కంటే వినియోగదారులను బాగా ఆకట్టుకుందని బజాజ్ సంస్థ ఆశిస్తోంది.
పూర్తిగా కొత్త ఫ్రేమ్తో తయారుచేసిన చేతక్ 35 సిరీస్.. 3.5kWh బ్యాటరీ ప్యాక్తో ఉంటుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదు. పర్ఫామెన్స్తో రాజీ పడకుండా.. ఈ మోడల్లో 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ను బజాజ్ సంస్థ అందించింది.

ఆటో ఎక్స్పోలో బజాజ్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన అంశం.. పల్సర్ RS200 స్పోర్ట్స్ బైక్. దీన్ని కొత్త రంగుల్లో, కొన్ని మార్పులు చేసి తీసుకువచ్చారు. దీని ఎక్స్- షో రూమ్ ధర రూ.1.84 లక్షలుగా ఉంది. ఈ బైక్ కొనాలంటే అంతకుముందు మోడల్ కంటే రూ.10,000 అదనంగా ఖర్చు చేయాలి.
ఈ కొత్త పల్సర్ RS200 బైక్.. కొత్త టెయిల్- ల్యాంప్ డిజైన్తో ఉంటుంది. NS400Z మోడల్లో ఉన్నట్లుగానే ఇందులో కూడా LCD డ్యాష్ బోర్డ్, రైడింగ్ మోడ్స్, స్లిప్పర్ క్లచ్ వంటివి ఉంటాయి. ఇవి స్వల్ప మార్పులే అయినప్పటికీ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా దీన్ని అప్డేట్ చేశారు. ఇందులో 199.5 cc, లిక్విడ్- కూల్డ్, సింగిల్- సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇలాంటి ఇంజిన్ KTM 200 సీసీ బైకుల్లో ఉంటుంది.
ఈ కొత్త ఇంజిన్ 6- స్పీడ్ గేర్ బాక్స్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్తో అనుసంధానించి ఉంటుంది. ఇది 9,750 rpm వద్ద 24 bhp పవర్, 8,000 rpm వద్ద 18.7 Nm టార్క్ అందించగలదు. ఈ సెగ్మెంట్లో పల్సర్ RS200 బైక్.. హీరో కరీష్మా XMR , యమహా R15 V4 బైకులకు గట్టి పోటీగా ఉంటుంది.
ఆటో ఎక్స్పోలో బజాజ్ స్టాల్కు సంబంధించి మరో ఆకర్షణీయమైన అంశంగా ఇథనాల్తో నడిచే మోటార్ సైకిల్స్ అని చెప్పాలి. ఇంతకుమందు ఎక్స్పో ఎడిషన్లలో E60-E85 ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలంగా ఉండే పల్సర్ NS160 బైక్ని ప్రదర్శించింది బజాజ్. ఈసారి ఇదే సాంకకేతికతో వచ్చే మరిన్ని వాహనాలను పరిచయం చేసే అవకాశం ఉంది. అలాగే ఫ్రీడమ్ 125 సీఎన్జీ బైకుకు సంబంధించి కొత్త వేరియంట్ను కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








