జీఎస్టీతో బైక్ల ధరలు తగ్గుతాయి అనుకుంటే.. పెరిగాయే.. బైక్ కొనాలంటే ఇప్పుడు ఎక్కువే పెట్టాలి!
కొత్త జీఎస్టీ స్లాబ్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో చాలా కార్లు, బైక్ల ధరలు తగ్గుతాయని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ఇది అన్ని వాహనాలకు వర్తించదు. ముఖ్యంగా 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ గల బైక్ల ధరలు పెరగనున్నాయి. ఈ కొత్త పన్ను విధానం బైక్ ప్రేమికులను ఎలా ప్రభావితం చేయబోతోంది? ఏ మోడల్స్కు ధరలు పెరుగుతాయో తెలుసుకుందాం.
కొత్త జీఎస్టీ నియమాలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్లు, టూ-వీలర్స్పై జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఈ కొత్త పన్ను రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఈ మార్పులు అన్ని వాహనాలకు ఒకేలా వర్తించవు. 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ గల బైక్ల ధరలు తగ్గుతాయి, కానీ 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ గల బైక్ల ధరలు మాత్రం పెరుగుతాయి. ఈ మార్పు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొంత గందరగోళాన్ని సృష్టించింది.

ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ప్రస్తుతం 350 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ గల బైక్లపై 28% జీఎస్టీ, 3% సెస్ ఉంది. కొత్త నియమం ప్రకారం.. సెస్ తొలగించి, నేరుగా 40% జీఎస్టీని విధించాలని నిర్ణయించారు. అంటే, పాత రేట్లతో పోలిస్తే దాదాపు 9% అదనపు పన్నును ప్రీమియం బైక్లపై చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పెంపు సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, ప్రీమియం మోటార్సైకిల్స్ ఇష్టపడే వారికి మాత్రం ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అధిక సామర్థ్యం గల బైక్లకు భారత మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అందుకే ఈ ధరల పెంపు ఈ విభాగపు కస్టమర్లను తీవ్రంగా నిరాశపరుస్తుంది.

ఏ బైక్ల ధరలు పెరుగుతాయి?
ఈ కొత్త నిబంధన రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీలకు ఒక సవాలుగా మారవచ్చు. ఎందుకంటే, ఆ కంపెనీ 350 సీసీ కంటే తక్కువ, ఎక్కువ కెపాసిటీ గత బైక్లను ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్, క్లాసిక్, మీటియోర్, బుల్లెట్ వంటి మోడల్స్ ధరలు తగ్గుతాయి. కానీ, హిమాలయన్ 450, గొరిల్లా 450, స్క్రామ్ 440, 650 ట్విన్స్ వంటి బైక్ల ధరలు మాత్రం బాగా పెరుగుతాయి.
రాయల్ ఎన్ఫీల్డ్కు మాత్రమే కాకుండా, కేటీఎం, ట్రయంఫ్ వంటి కంపెనీల ప్రీమియం బైక్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. బజాజ్ పల్సర్ NS400Z మోడల్పై దాదాపు రూ.13,100 పెరగవచ్చు. కేటీఎం 390 డ్యూక్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 వంటి ప్రీమియం బైక్లపై రూ.20,000 కంటే ఎక్కువ ధర పెరిగే అవకాశం ఉంది.

ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X, థ్రక్స్టన్ 400 బైక్లపై రూ.17,000 నుంచి రూ.18,800 వరకు ధరలు పెరగవచ్చు. హిమాలయన్ 450 కొనాలనుకునే వారు కనీసం రూ.20,500 అదనంగా చెల్లించాల్సి రావచ్చు.
ధరలు తగ్గే అవకాశం ఉందా?
అన్ని విభాగాల్లో ఒకే విధమైన పన్ను రేటును తీసుకురావాలని బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ జీఎస్టీ కౌన్సిల్ను కోరాయి. ఇది అమలు అయితే, ప్రస్తుత ధరలు మరింత తగ్గుతాయి, ఇది మార్కెట్కు పెద్ద ఊపునిస్తుంది. కానీ ఈ ప్రతిపాదన ఆమోదమయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








