రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కు ఊహించని షాకింగ్ న్యూస్.. బైక్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా ?
భారతదేశంలో ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గుతాయనే వార్తలు ఇటీవల వెలువడ్డాయి. అక్టోబర్ నాటికి ధరలను తగ్గించడానికి, వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ)ను సరళీకృతం చేయడానికి ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం ఈ ధర తగ్గింపుకు కారణమవుతుంది. తక్కువ సామర్థ్యం గల ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ పన్ను సవరణ వల్ల వాటి ధరలు తగ్గుతాయి.
350 సీసీ వరకు ఉన్న మోటార్సైకిళ్లు, స్కూటర్లకు ప్రస్తుతమున్న 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించనున్నారు. కానీ, కొత్త స్లాబ్లు అమల్లోకి వస్తే పెద్ద బైక్లు కొనాలనుకునే వారికి ఇది ఒక ఎదురుదెబ్బగా మారనుంది.

భారీగా పెరగనున్న పెద్ద బైక్స్ ధరలు
ఎందుకంటే, 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న మోడళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రతిపాదిత మార్పుల ప్రకారం, 350 సీసీ, అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్సైకిళ్లకు ఇప్పుడు 40 శాతం అధిక జీఎస్టీ రేటు వర్తిస్తుంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కొత్త జీఎస్టీ నిర్మాణం ఎలా ఉంటుంది?
2017లో కేంద్ర ప్రభుత్వం వస్తువులు సేవల కోసం నాలుగు స్లాబ్స్ పన్ను నిర్మాణంతో జీఎస్టీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ పన్ను నిర్మాణం 5, 12, 18, 28 శాతాలుగా ఉండేది. 12 శాతం, 28 శాతం స్లాబ్లను తొలగించి, రెండు ప్రామాణిక రేట్లను మాత్రమే చేర్చడం ద్వారా జీఎస్టీని సరళీకృతం చేసే ప్రయత్నంలో ఈ ప్రతిపాదిత మార్పులు ఉన్నాయి.

దీని ప్రకారం, అత్యవసర వస్తువులకు 5 శాతం, ప్రామాణిక వస్తువులకు 18 శాతం, అలాగే వ్యసనకారక వస్తువులు, ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్ల వంటి విలాసవంతమైన వస్తువులకు 40 శాతం ప్రత్యేక రేటు విధించనున్నారు. 2017లో ప్రతిపాదించిన సంస్కరణలు ఇప్పటివరకు అమలు చేయకపోవడం కొంత ఊరట కలిగించింది. కానీ ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిర్మాణంపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.
కొత్త రేట్ల ప్రభావం ఏంటి?
ప్రస్తుత పన్ను విధానంలో 350 సీసీ, అంతకంటే ఎక్కువ ద్విచక్ర వాహనాలకు 28 శాతం పన్ను, అదనంగా 3 శాతం సెస్ విధించబడుతుంది. దీంతో మొత్తం 31 శాతం పన్ను చెల్లించాలి. చిన్న బైక్లు, స్కూటర్లకు సెస్ లేకుండా 28 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. కొత్త జీఎస్టీ నిర్మాణం చిన్న సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు పన్ను స్లాబ్ను 18 శాతానికి తగ్గిస్తుంది.

ఇది సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఎక్కువ భాగం ఎంట్రీ లెవల్ మోడల్స్పై కేంద్రీకృతమై ఉన్నందున, ఇది డిమాండ్ను పెంచే అవకాశం ఉంది. అదే సమయంలో 350 సీసీ కంటే ఎక్కువ ఉన్న బైక్లకు 40 శాతం ప్రత్యేక రేటు పన్ను విధిస్తే చాలామంది కలలకు ఇది ఒక దెబ్బలా మారవచ్చు.
కొత్త ప్రతిపాదన అమలు అయితే ప్రీమియం బైక్ సెగ్మెంట్లో భారీ ధరల పెరుగుదల ఉంటుంది. కొత్త జీఎస్టీ అమలు అయితే ఆన్-రోడ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అన్ని వాహనాల ఎక్స్-షోరూమ్ ధర జీఎస్టీతో కలిపి నిర్ణయించబడుతుంది. పన్ను రేట్లలో ఏదైనా మార్పులు ధర, కస్టమర్పై పడే మొత్తం ఖర్చుపై నేరుగా ప్రభావం చూపుతాయి.
ఈ అదనపు పన్ను భారాన్ని తయారీదారులు కస్టమర్లకు బదిలీ చేస్తారు. 40 శాతానికి పెరిగితే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, మీటియోర్, హోండా హైనెస్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. ఏదేమైనా, సెప్టెంబర్ చివరి నాటికి దీనిపై ఒక నిర్ణయం వస్తుందని ఆశించవచ్చు. 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం గల టూ-వీలర్లు కొనాలని ప్లాన్ చేస్తున్నవారు వెంటనే షోరూమ్కి వెళ్లి బుక్ చేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications








