కారు, బైక్ కొనేవారికి పండగ లాంటి వార్త.. భారీగా తగ్గనున్న యాక్టివా, స్ల్పెండర్ ధరలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే హోండా యాక్టివా, హీరో స్ప్లెండర్ వంటి వాహనాల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. మరి, ఏ వాహనాలపై ఎంత పన్ను తగ్గింది? కొత్త ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
పండుగ సీజన్కు ముందు సామాన్య ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సుమారు 175వస్తువుల పై పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ సంస్కరణల కారణంగా ద్విచక్ర వాహనాలు, చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా వంటి వాహనాలు ఇకపై మరింత సరసమైన ధరలకు లభించనున్నాయి.
56వ GST కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 12%, 28% పన్ను శ్లాబులను రద్దు చేసి, వాటి స్థానంలో 5%, 18% అనే రెండు మెయిన్ శ్లాబులను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.

350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్లు, స్కూటర్లు: వీటిపై GSTని 28% నుంచి 18%కి తగ్గించారు. దీనివల్ల మార్కెట్లో దాదాపు 98% ద్విచక్ర వాహనాల ధరలు తగ్గుతాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా యాక్టివా, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచే, రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ మోడల్స్ (హంటర్, క్లాసిక్, మెటియోర్) వంటి వాటి ధరలు తగ్గనున్నాయి.
350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్లు: ఈ ప్రీమియం బైక్లపై పన్నును పెంచారు. ఇంతకుముందు 28% జీఎస్టీతో పాటు 3% సెస్ ఉండేది. ఇప్పుడు ఈ సెస్ తొలగించి, పన్నును నేరుగా 40%కి పెంచారు. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450, 650 సీసీ బైక్లు, కేటీఎం 390 వంటి మోడళ్లు మరింత ఖరీదైనవిగా మారతాయి.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు, ఢిల్లీలో ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,426 ఉంది. దీనిపై 10% పన్ను తగ్గితే, దాని ధర దాదాపు రూ. 7,900 వరకు తగ్గుతుంది.
అంటే, కొత్త జీఎస్టీ రేటు అమలైన తర్వాత, దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 71,526 కి చేరే అవకాశం ఉంది. ఎక్స్-షోరూమ్ ధరతో పాటు, ఆర్టీఓ, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలుపుకొని ఆన్-రోడ్ ధరలో కూడా గణనీయమైన తగ్గుదల ఉంటుంది.
ఈ పన్ను తగ్గింపు నిర్ణయంతో ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త ఊపు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పండుగల సీజన్లో ప్రజలు కొత్త వాహనాలు కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీంతో ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగి పరిశ్రమకు మరింత లాభం చేకూరనుంది.
అలాగే, ఆటో విడిభాగాలపై కూడా జీఎస్టీ 18%కి తగ్గించడం పరిశ్రమకు ఒక పెద్ద ఉపశమనం. అయితే, ప్రీమియం బైక్ మార్కెట్పై మాత్రం పెంపు ప్రభావం చూపనుంది.


Click it and Unblock the Notifications








