కొత్త స్కూటర్లు వస్తున్నాయ్.. 2025 రెండో సగంలో మార్కెట్లో వీటి హంగామా మామూలుగా ఉండదు!
భారత టూ వీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనాలకు కూడా డిమాండ్ ఉండడంతో కంపెనీలు కొత్త ఫేస్లిఫ్ట్ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి, రాబోయే నెలల్లో ఏ కంపెనీల నుంచి ఏ స్కూటర్లు విడుదల కానున్నాయో ఈ వార్తలో తెలుసుకుందాం.
1. హోండా యాక్టివా: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ హోండా యాక్టివా త్వరలోనే కొన్ని ముఖ్యమైన అప్డేట్లతో విడుదల కానుంది. ఇది కొత్తగా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్లను పొందనుంది. డిజైన్లో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ప్రధాన డిజైన్ అలాగే ఉంటుంది. అప్డేట్ చేసిన యాక్టివా రాబోయే దసరా పండుగ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

2. బజాజ్ చేతక్: అప్డేట్ చేసిన బజాజ్ చేతక్ 2903 ఎంట్రీ లెవల్ మోడల్ ఈ నెలలో విడుదల కానుంది. ఈ అప్డేట్ చేసిన మోడల్ 3.5 కిలోవాట్ బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ 3503 వేరియంట్ల ఆధారంగా, ఇది పెద్ద 35-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, గంటకు 63 కి.మీ టాప్ స్పీడ్, 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది
సింగిల్ ఛార్జ్పై ఇది 151 కి.మీ.ల రేంజ్ను ఇస్తుంది. ఈ స్కూటర్ ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడ్ మోడ్లను కలిగి ఉంటుంది. జూన్లో మరింత తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయడానికి బజాజ్ కంపెనీ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది.

3. హీరో విడా: హీరో కంపెనీ భారతదేశంలో జూలై 1న విడా జెడ్, విడా వీఎక్స్2 అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వీఎక్స్2 హీరో విడా శ్రేణిలో బడ్జెట్ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విడా వీ2 - లైట్, ప్లస్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.74,000 నుండి రూ.1,20,300 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
కొత్త స్కూటర్లు పెద్ద 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్లతో మంచి పర్ఫామెన్స్, ఎక్కువ దూరం ప్రయాణించే హామీని ఇస్తాయి. ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లతో ఈసారి యువ కొనుగోలుదారులను మరింత ఆకర్షించనున్నాయి. స్టైలిష్ డిజైన్, అధిక పనితీరు, సరసమైన ధరలో ఈవీలను కోరుకునే విస్తృత శ్రేణి వినియోగదారులకు ఇవి సరిపోతాయి.

4. టీవీఎస్ మోటార్: టీవీఎస్ కంపెనీ తన స్పోర్టీ ఎన్టార్క్ను 150 సీసీ ఇంజిన్తో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విభాగంలో ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160, హీరో జూమ్ 160, యమహా ఏరాక్స్ 155 స్కూటర్లు ఇప్పటికే దుమ్ము రేపుతున్నాయి. మరింత శక్తివంతమైన 150 సీసీ స్కూటర్ను విడుదల చేయనుందనే పుకారు కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఈ స్కూటర్ సంవత్సరం చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: ప్రస్తుతం మార్కెట్లో స్కూటర్ల వాడకం చాలా పెరిగింది. మరోవైపు ఈవీల హవా కూడా జోరుగా ఉంది. రెండు వాహన విభాగాలలో పోటీ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పోటీ ఏ స్థాయికి చేరుకుంటుందో వేచి చూడాలి. మీకు ఈవీలు లేదా ఇంధనంతో నడిచే స్కూటర్లు రెండింటిలో ఏది ఇష్టమో కామెంట్లలో తెలియజేయండి.


Click it and Unblock the Notifications








