సింగిల్ ఛార్జ్తో 320 కి.మీ. రేంజ్..ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్కూటర్ల డెలివరీలు షురూ
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఒకప్పుడు సంచలనం సృష్టించింది. క్యాబ్ అగ్రిగేటర్ నుంచి ఈవీ తయారీలోకి అడుగుపెట్టిన ఓలా అద్భుతమైన వృద్ధిని సాధించింది. అయితే గతంలో విక్రయాల తర్వాత సేవల విషయంలో అనేక ఫిర్యాదులు రావడంతో ఓలా కొంత విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ తమ తొలి విజయాల బలంపై విక్రయాలు పర్వాలేదనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తాజాగా స్వదేశీంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్తో కూడిన ఓలా S1 ప్రో ప్లస్ (Ola S1 Pro Plus) ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించి వార్తల్లో నిలిచింది. దీనితో భారత్లో తయారైన సెల్, భారత్లో తయారైన బ్యాటరీ ప్యాక్ ఉపయోగించి ఈవీ స్కూటర్లను విక్రయిస్తున్న మొదటి భారతీయ కంపెనీగా ఓలా నిలిచింది.

ఓలా S1 ప్రో ప్లస్ స్కూటర్లో కొత్తగా 5.2 kWh బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించారు. దీనిని 4680 భారత్ సెల్ అని పిలుస్తున్నారు. ఈ బ్యాటరీని తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బ్యాటరీ అభివృద్ధికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రం కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న బ్యాటరీ ఇన్నోవేషన్ సెంటర్లో పూర్తి చేశారు.
ఈ సెల్ను అభివృద్ధి చేయడంలో ఓలా ముఖ్య ఉద్దేశం, ఈవీ తయారీ కోసం చైనా, ఇతర విదేశీ బ్యాటరీ సెల్ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం. ఓలా S1 ప్రో ప్లస్ పనితీరు, ఫీచర్లు బైక్ రైడర్లను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్పై 320 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ను ఇస్తుంది. ఇందులో 13kW ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు.

హైపర్ మోడ్ను ఉపయోగించి గంటకు 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా కేవలం 2.1 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్లో 242 కిలోమీటర్ల రేంజ్ అందించే చిన్న 4kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా ఉంది. ఓలా S1 ప్రో ప్లస్ సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్ల విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడలేదు.
ఇందులో మొదటి డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (ABS), మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, బ్రేక్-బై-వైర్ సాంకేతికత వంటి భద్రతా ఫీచర్లను అందించారు.బాడీ-కలర్ మిర్రర్లు, కొత్త అల్యూమినియం గ్రాబ్ హ్యాండిల్, పూర్తి చైన్ కవర్ మరియు సింగిల్ టోన్ సీట్ వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి. SOS అలర్ట్లు, రోడ్ ట్రిప్, భారత్ మోడ్, నావిగేషన్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, మ్యూజిక్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్న పెద్ద TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో అమర్చారు.

ఓలా S1 ప్రో ప్లస్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణీలో అత్యంత ఖరీదైన మోడల్. స్వదేశీ బ్యాటరీ ప్యాక్ల వాడకం వలన కంపెనీ తన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి, స్కూటర్ను మరింత విలువైన ఈవీగా మార్చడానికి సహాయపడింది. భారత్ సెల్ ఉపయోగించే ఈ వేరియంట్ ధర భారతదేశంలో రూ.1.54 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ స్కూటర్ సెగ్మెంట్లో ప్రధానంగా టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), ఏథర్ 450 (Ather 450), హీరో విడా V2 ప్రో (Hero Vida V2 Pro), చేతక్ 3501 వంటి ఈవీలతో పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications







