చైనాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఓలా..రేర్ ఎర్త్ మాగ్నెట్స్ లేకుండానే మోటార్ తయారీ..ఈవీల తయారీలో సెన్సేషన్
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఈవీల తయారీలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఒక చారిత్రక ఘనతను సాధించింది. ఈవీ మోటార్లలో తప్పనిసరిగా ఉపయోగించే రేర్ ఎర్త్ మాగ్నెట్లు లేకుండానే తయారు చేసిన ఫెర్రైట్ మోటార్కు దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఈవీ తయారీలో చైనా ఆధిపత్యం తగ్గుతుందని తద్వారా భారత్ ఈ రంగంలో సాధికారత సాధిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఆవిష్కరణ రాబోయే రోజుల్లో ఈవీ ఇండస్ట్రీకి పెద్ద ఊతం ఇస్తుంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే మోటార్లలో ఉండే మ్యాగ్నెట్లు రేర్ ఎర్త్ అనే ముడిసరుకుతో తయారు అవుతాయి. ఈ రేర్ ఎర్త్ సరఫరాలో ప్రపంచవ్యాప్తంగా చైనాకు దాదాపు 90% వరకు గుత్తాధిపత్యం ఉంది. దీని కారణంగా దేశంలోని ఈవీ కంపెనీలు మోటార్ తయారీ కోసం ఈ మ్యాగ్నెట్లను చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

గతంలో చైనా రేర్ ఎర్త్ ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో బజాజ్ వంటి అనేక భారతీయ కంపెనీల ఉత్పత్తి పెద్ద ఎత్తున దెబ్బతింది. ఇది అమ్మకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపించింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆత్మనిర్భరత ఎంత అవసరమో ఈ సంఘటనలు నిరూపించాయి.
ఈ సమస్యకు పరిష్కారంగా ఓలా సంస్థ పూర్తిగా దేశీయంగా ఫెర్రైట్ అనే కొత్త మోటారును తయారు చేసింది. ఈ కొత్త మోటారులోని మ్యాగ్నెట్లలో రేర్ ఎర్త్ ముడిసరుకు అవసరం లేదు. దీని కారణంగా ఈ మోటారును పూర్తిగా చైనాపై ఆధారపడకుండా తయారు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ మోటారును తయారు చేయడానికి అయ్యే ఖర్చు కూడా రేర్ ఎర్త్ మోటారుతో పోలిస్తే తక్కువగా ఉంటుందని, ఇది తయారీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని సంస్థ తెలిపింది.

ఓలా రూపొందించిన ఈ మోటారును తమిళనాడులోని గ్లోబల్ ఆటోమోటివ్ రీసెర్చ్ సెంటర్ (GARC) వద్ద కఠినమైన పరీక్షలకు గురి చేశారు. ఈ మోటారు AIS 041 పవర్ టెస్ట్తో పాటు, కేంద్ర రహదారి రవాణా శాఖ నిర్దేశించిన అన్ని ప్రమాణాలలో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచినట్లు ధ్రువీకరించబడింది. 7kW, 11kW వేరియంట్లలోని ఈ మోటార్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లతో తయారు చేయబడిన మోటార్ల పర్ఫామెన్స్ ఏమాత్రం తగ్గకుండా పనిచేసినట్లు సర్టిఫికెట్ లభించింది.
ఈ మోటారుకు ప్రభుత్వ సర్టిఫికేషన్ లభించినందున, ఓలా సంస్థ ఈ ఫెర్రైట్ మోటారును తన రాబోయే వాహనాల్లో అమర్చడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. ఈ మోటారును అమర్చడం ద్వారా వాహనాల రేంజ్, పర్ఫామెన్స్, డ్యూరబిలిటీ వంటి అంశాలు మారవచ్చు. ఇది ఖచ్చితంగా ఆ సంస్థ వృద్ధికి, ఈవీ రంగంలో ఆత్మనిర్భరతకు ఒక మైలురాయిగా నిలుస్తుంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం: రేర్ ఎర్త్ మాగ్నెట్ను ఎగుమతి చేయడాన్ని చైనా నిషేధించినప్పుడు భారతదేశం తీవ్రంగా ప్రభావితమైంది. భవిష్యత్తులో ఇలాంటి సమస్య వస్తే భారతదేశం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది. ఈ నేపథ్యంలో చైనాపై ఆధారపడకుండా ఓలా సంస్థ మాగ్నెట్ను తయారుచేసి ఘన విజయం సాధించింది అని చెప్పవచ్చు. ఈవీ రంగంలో భారతదేశం భారీ వృద్ధిని సాధిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








