పెట్రోల్ ఖర్చు తగ్గించుకునే పనిలో పడ్డ భారతీయులు.. కరెంట్ స్కూటర్లను ఎడాపెడా కొనేస్తున్నారు
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కాలంగా ఈవీల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ల సెగ్మెంట్ మంచి వృద్ధిని నమోదు చేసింది.
అయితే, ఈసారి టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చూపించగా, ఒకప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న ఓలా (Ola) ఎలక్ట్రిక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మరోవైపు హీరో మోటోకార్ప్ విడా (Vida) ఓలాను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకోవడం గమనార్హం.

నవంబర్ నెలలో భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన (Electric Two-Wheeler) మార్కెట్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS) ఈసారి ఏకంగా 27,382 యూనిట్లను అమ్మి, 26% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. దీని తర్వాత, బజాజ్ ఆటో (Bajaj Auto) తన చేతక్ (Chetak) స్కూటర్ల ద్వారా 23,097 యూనిట్ల అమ్మకాలతో (21.9% వాటా) రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
ఏథర్ ఎనర్జీ (Ather Energy) 18,356 యూనిట్లతో (17.4% వాటా) మూడవ స్థానంలో నిలబడింది. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ విడా (Hero Vida) బ్రాండ్ 10,579 యూనిట్లతో (10% వాటా) బలమైన ప్రదర్శన ఇచ్చి నాలుగో స్థానానికి చేరుకుంది. ఒకప్పుడు ఈ విభాగంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.

నవంబర్లో ఓలా కేవలం 7,567 యూనిట్లకు (7.2% వాటా) పరిమితమై, ఐదవ స్థానానికి పడిపోయింది. ఓలా పతనానికి ప్రధాన కారణాలుగా తీవ్రమవుతున్న పోటీ, కంపెనీ నిర్వహణలో సవాళ్లు చెబుతున్నాయి. ముఖ్యంగా, సర్వీస్కు సంబంధించిన వినియోగదారుల ఫిర్యాదులు పెరగడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఒకప్పుడు భారతీయ ఈవీ ద్విచక్ర వాహన విభాగంలో ఆధిపత్యాన్ని చూపించిన ఓలా కంపెనీ అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.
నవంబర్లో ఐదో స్థానానికి పడిపోకముందే, అక్టోబర్ నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ నాలుగో స్థానానికి కుప్పకూలింది. 2024 అక్టోబర్లో 41,843 యూనిట్లు అమ్మి అగ్రస్థానంలో ఉన్న ఓలా, ఈ ఏడాది అక్టోబర్లో కేవలం 16,034 యూనిట్లు మాత్రమే అమ్మింది. అంటే, కేవలం సంవత్సరంలోనే 62% పతనాన్ని నమోదు చేసింది.

ఇది అగ్రగామి EV కంపెనీలలో నమోదైన అతిపెద్ద పతనం కావడం గమనార్హం. ఈ ప్రధాన కంపెనీలతో పాటుగా, ఆంపియర్ ఎలక్ట్రిక్ (5,360 యూనిట్లు), బిగాస్ (2,410 యూనిట్లు), రివర్ (1,612 యూనిట్లు) వంటి కొత్త బ్రాండ్లు కూడా మార్కెట్లో మంచి వృద్ధిని సాధిస్తున్నాయి.
భారతీయ ఈవీ మార్కెట్లో పోటీ తీవ్రత పెరుగుతోంది. సర్వీస్, నాణ్యతలో వెనుకబడిన కంపెనీలు త్వరలోనే ఈ పోటీ నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ ఫలితాలు స్పష్టంగా సూచిస్తున్నట్లుగా, వినియోగదారులు ఇకపై కేవలం ధరను మాత్రమే కాదు, విశ్వసనీయత, మెరుగైన కస్టమర్ సర్వీస్ను అందించే బ్రాండ్లవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ను అర్థం చేసుకోలేని ఏ కంపెనీ అయినా, మార్కెట్ లీడర్షిప్ను కోల్పోక తప్పదు..


Click it and Unblock the Notifications








