10 ఏళ్ల కృషి.. ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకున్న రోజునుంచి.. 50 లక్షల దాకా! ఏరోక్స్ 155తో మధురమైన క్షణం
యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) దేశంలో టూవీలర్ విభాగంలో హోండా, హీరో కంపెనీలకు బలమైన పోటీగా నిలుస్తూ అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. ఈ కంపెనీకి చెన్నైకు సమీపంలో, శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో టూవీలర్ తయారీ ప్లాంట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది ప్రారంభమై ఇప్పుడు దశాబ్ద కాలం పూర్తయింది. దీనిని 2015లో కంపెనీ స్థాపించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, యమహా ఇప్పుడు చెన్నై ఫ్యాక్టరీ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. సంస్థకు ఇది కేవలం ఓ సాధారణ విజయమే కాదు, భారతీయ మార్కెట్లో తమ బలమైన ఉనికిని చాటే మరో కీలక మైలురాయి కూడా. ఈ జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు తమ చెన్నై ఫ్యాక్టరీలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ వేడుకలో సంస్థ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, మరియు పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా నిరంతరమైన నాణ్యత, సామర్థ్యం, వినియోగదారుల నమ్మకాన్ని పొందడంలో చెన్నై ప్లాంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో తయారవుతున్న వాహనాలు దేశీయ మార్కెట్కే కాదు, ఇతర దేశాలకు ఎగుమతులుగా కూడా ప్రయాణిస్తున్నాయి. చెన్నై అంటే కేవలం మౌలిక వసతులు ఉన్న నగరం కాదు, అది పరిశ్రమలకు మార్గనిర్దేశక నగరంగా ఎదిగింది.

బెంగళూరును దేశం సాఫ్ట్వేర్ రాజధానిగా గుర్తిస్తే, చెన్నైను పారిశ్రామిక రాజధానిగా పరిగణించవచ్చు. ఎందుకంటే, ఆటోమొబైల్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, అనేక రంగాల్లో కీలక కంపెనీలు చెన్నై పరిసరాల్లో తమ ప్లాంట్లు, ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో, యమహా చెన్నై ఫ్యాక్టరీ స్థాపనకు 10 సంవత్సరాలు పూర్తవడం అనేది కేవలం సంస్థ విజయం మాత్రమే కాదు, చెన్నై పారిశ్రామిక ప్రాధాన్యతకు ఒక గౌరవార్థకం గుర్తింపుగా నిలుస్తోంది.
చెన్నై ప్లాంట్లో 50 లక్షల టూవీలర్స్ తయారీని పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని గుర్తుగా, 50 లక్షవ టూవీలర్ వాహనంగా యమహా ఏరోక్స్ 155 వెర్షన్ Sను సంస్థ విడుదల చేసింది. ప్రత్యేకమైన నీలిరంగులో తయారైన ఈ స్కూటర్ను చెన్నై ఫ్యాక్టరీ ఉద్యోగులు సంబరంగా ఆవిష్కరించారు. ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ వారు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సంస్థలోని ఆనందాన్ని పంచుతున్నాయి.

ఇక్కడ తయారయ్యే ద్విచక్ర వాహనాలలో సుమారు 30 శాతం ఎగుమతి అవుతున్నాయి. చెన్నై ఓడరేవు శ్రీపెరంబుదూర్కి అత్యంత సమీపంలో ఉండటంతో, ఉత్పత్తి చేసిన వాహనాలను ప్రపంచ దేశాలకు రవాణా చేయడం యమహాకు ఎంతో సౌలభ్యంగా మారింది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో RayZR 125, Fascino 125 వంటి డైలీ యూజ్ స్కూటర్లు, Aerox 155 లాంటి స్కూటర్లను FZ, Saluto బైక్లను యమహా ఉత్పత్తి చేస్తోంది.
చెన్నై నగరానికి సమీపంలో ఉన్న శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో ఓ విశేషమైన పారిశ్రామిక వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రాంతం 'సిప్చాట్ గ్రామం' పేరుతో విస్తరించి ఉండగా, ఇది దక్షిణ భారతదేశానికి ఆటోమొబైల్ తయారీ హబ్గా మారింది. ఈ గ్రామం అనేక అంతర్జాతీయ కంపెనీలకు నిలయంగా నిలుస్తోంది. హ్యుందాయ్కి చెందిన కార్ల తయారీ కర్మాగారం, అలాగే యమహా మోటార్ కంపెనీకి చెందిన టూవీలర్ తయారీ కేంద్రం ఇదే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

యమహా 2015లో సిప్చాట్ గ్రామంలో తన రెండవ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. సుమారు 177 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కర్మాగారం, గత దశాబ్దంలో సంస్థకు అత్యంత కీలకంగా మారింది. లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన మానవ వనరులు, సమర్థవంతమైన మౌలిక వసతుల వల్ల ఈ ప్లాంట్కి ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత లభించింది. ఇక్కడ తక్కువ తయారీ ఖర్చులు, విస్తృత మార్కెట్, అనుకూల ప్రభుత్వ విధానాలు ఉన్నాయి.
యమహా గత పదేళ్లుగా చెన్నై ప్లాంట్ను తన గ్లోబల్ అవసరాల కోసం ప్రధానంగా వినియోగిస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా తయారైన టూవీలర్ వాహనాలు కేవలం భారత మార్కెట్కే కాకుండా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. ఇది చెన్నైకు గల అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యతను మరింతగా బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో, సిప్చాట్ గ్రామం కేవలం ఒక పారిశ్రామిక కేంద్రంగా కాదు, భారతదేశం ఆటోమొబైల్ రంగంలో ప్రపంచానికి కీలకంగా మారింది.


Click it and Unblock the Notifications








