ఏథర్ ఎనర్జీ మెగా ప్లాన్.. పెట్రోల్ బంకుల్లాగే అడుగడుగునా ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడేవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఛార్జింగ్. ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసే దిశగా ఏథర్ ఒక భారీ అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఏథర్ వినియోగదారులు ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ వాహన రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ఎంత ముఖ్యమో ఏథర్ ఎనర్జీకి బాగా తెలుసు. అందుకే గత ఏడేళ్లుగా కేవలం స్కూటర్ల తయారీపైనే కాకుండా, ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధిపై కూడా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఏథర్ నెట్వర్క్ దేశంలోని 395 నగరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఏథర్ స్వయంగా నిర్వహిస్తున్న 3,675 ఫాస్ట్ ఛార్జర్లతో పాటు, భాగస్వామ్య సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న మరో 1,400 ఛార్జర్లు కూడా ఉన్నాయి. అంటే మొత్తం మీద 5,000కు పైగా పాయింట్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

ఈ ఛార్జింగ్ పాయింట్లను కేవలం పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా, టైర్-2, టైర్-3 నగరాలకు కూడా ఏథర్ విస్తరించింది. బెంగళూరు, పుణె, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాల్లో ప్రతి చోటా 100 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కేవలం బెంగళూరులోనే అత్యధికంగా 240 ఛార్జర్లు ఉన్నాయి. వీటితో పాటు నాసిక్, ఇండోర్, కోజికోడ్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో కూడా 45 నుంచి 65 వరకు ఫాస్ట్ ఛార్జర్లు ఉండటం గమనార్హం. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాలు ఈ నెట్వర్క్లో ముందంజలో ఉన్నాయి.
ఏథర్ ఎనర్జీ తన ఛార్జింగ్ సామ్రాజ్యాన్ని కేవలం భారతదేశానికే పరిమితం చేయలేదు. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంకలో కూడా ఇప్పటికే 30కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు పని చేస్తున్నాయి. దీనివల్ల ఇంటర్-సిటీ ప్రయాణాలు చేసే వారికి, అంటే ఒక నగరం నుంచి మరొక నగరానికి లాంగ్ డ్రైవ్ వెళ్లే వారికి ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. రైడర్లు ఆత్మవిశ్వాసంతో సుదూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చని ఎథర్ సిబిఒ రవ్నీత్ సింగ్ ఫోకెలా ధీమా వ్యక్తం చేశారు.

ఏథర్ ఎనర్జీ అభివృద్ధి చేసిన LECCS (Light Electric Combined Charging System) కనెక్టర్ ఈ విజయానికి ప్రధాన కారణం. ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కనెక్టర్కు 2023లో బిఐఎస్ (BIS - బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లభించింది. ఏథర్ తన ఈ సాంకేతికతను (IP) అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల హీరో విడా, మ్యాటర్ వంటి ఇతర కంపెనీలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనివల్ల వేర్వేరు బ్రాండ్ల స్కూటర్లు కూడా ఎథర్ పాయింట్లలో ఛార్జింగ్ చేసుకునే వీలు కలుగుతుంది.
వినియోగదారుల సౌకర్యార్థం ఏథర్ తన ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను Google Mapsతో అనుసంధానించింది. ఏథర్ రైడర్లు తమ స్మార్ట్ఫోన్ లేదా స్కూటర్ డాష్బోర్డ్ ద్వారా దగ్గరిలోని ఛార్జింగ్ పాయింట్ను సులభంగా గుర్తించవచ్చు, అక్కడికి నావిగేట్ చేయవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. ఈ తరహా మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు కూడా పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడానికి ఆసక్తి చూపుతారని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








