హీరో, హోండా కాదు.. బైకుల ఎగుమతుల్లో నంబర్ వన్ సీటు కొట్టేసిన ఇండియన్ కంపెనీ ఇదే
భారతదేశపు టూ-వీలర్ మార్కెట్ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బైకులు, స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగింది. తాజాగా ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ 2026 గణాంకాలను పరిశీలిస్తే.. భారతదేశం నుంచి జరిగే టూ-వీలర్ ఎగుమతులు ఏకంగా 23.44 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల సంఖ్య 41.96 లక్షలుగా ఉండగా, ఈ ఏడాది అది ఏకంగా 51.80 లక్షల యూనిట్లకు చేరుకోవడం విశేషం.
భారతదేశంలో హీరో, హోండా లాంటి కంపెనీల హవా ఎక్కువగా ఉన్నప్పటికీ.. విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం బజాజ్ ఆటో (Bajaj Auto) ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో బజాజ్ కంపెనీ ఏకంగా 18,80,155 బైకులను విదేశీ కస్టమర్లకు విక్రయించింది. గత ఏడాది ఎగుమతి చేసిన 16.06 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 17.01 శాతం ఎక్కువ. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఎగుమతి అవుతున్న మొత్తం భారతీయ టూ-వీలర్లలో అత్యధికంగా 36.29 శాతం మార్కెట్ షేర్ ఒక్క బజాజ్ కంపెనీదే కావడం విశేషం.

ఎగుమతుల రేసులో బజాజ్ తర్వాత స్థానంలో టీవీఎస్ మోటార్స్ (TVS) దూసుకుపోతోంది. టీవీఎస్ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 14,13,074 యూనిట్లను ఎగుమతి చేసి 31.81 శాతం బలమైన వృద్ధిని సాధించింది. దీని మార్కెట్ షేర్ 27.28 శాతంగా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న హోండా కంపెనీ 6,20,241 యూనిట్ల ఎగుమతులతో 23.16 శాతం వృద్ధిని నమోదు చేయగా.. మన దేశంలో నంబర్ వన్ సేల్స్ ఉన్న హీరో మోటోకార్ప్ విదేశీ ఎగుమతుల్లో మాత్రం కేవలం 4,02,743 యూనిట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. అయితే హీరో కంపెనీ వార్షిక వృద్ధి పరంగా 39.19 శాతం మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
ప్రముఖ క్లాసిక్ బైక్స్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి వృద్ధిని సాధిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ 1,31,336 బుల్లెట్ బైకులను విదేశాలకు పంపి 22.58 శాతం గ్రోత్ సాధించింది. మరోవైపు స్పోర్ట్స్ బైక్స్ బ్రాండ్ కేటీఎం (KTM) ఊహించని రేంజ్లో సంచలనం సృష్టించింది. కేటీఎం ఎగుమతులు ఏకంగా 107.21 శాతం పెరిగి, గత ఏడాది ఉన్న 29 వేల నుండి ఈ ఏడాది ఏకంగా 61,585 యూనిట్లకు చేరాయి. యామహా (3.41 లక్షలు), సుజుకి (2.64 లక్షలు) కంపెనీలు కూడా తమ ఎగుమతులను విజయవంతంగా పెంచుకున్నాయి.

ఒకవైపు సాధారణ బైకుల ఎగుమతులు పెరుగుతుంటే.. లగ్జరీ, ప్రీమియం బ్రాండ్లయిన ట్రయంఫ్ (-21.9%), అప్రిలియా (-20.51%), బీఎమ్డబ్ల్యూ (-24.38%), హుస్క్వర్నా (-87.54%) కంపెనీల ఎగుమతులు ఈ ఏడాది భారీగా క్షీణించాయి. అయితే ఈ రేసులో సరికొత్త ఆశగా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్రాండ్ ఏథర్ ఎనర్జీ (Ather Energy) నిలిచింది. ఏథర్ కంపెనీ ఎగుమతులు ఏకంగా 256.77 శాతం వృద్ధి చెంది, గత ఏడాది కేవలం 805 యూనిట్లుగా ఉన్న ఎగుమతుల సంఖ్యను ఈ ఏడాది 2,872 యూనిట్లకు పెంచుకుని గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది.


Click it and Unblock the Notifications