పేదోడి బడ్జెట్లో రూ.72 వేలకే.. స్ప్లెండర్ ప్లస్, HF డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్.. పెట్రోల్కు గుడ్బై!
భారతదేశంలో ద్విచక్ర వాహనాల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న హీరో మోటోకార్ప్ (Hero Motocorp) మరో కీలక ముందడుగు వేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్సైకిళ్లలో ఒకటైన స్ప్లెండర్ ప్లస్ (+), అలాగే గ్రామీ, పట్టణ ప్రాంతాల్లో విశేష ఆదరణ పొందిన హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లకు ఇప్పుడు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా కొత్త సాంకేతికతలను మొదట ప్రీమియం లేదా ఖరీదైన వాహనాల్లో ప్రవేశపెట్టే సంప్రదాయానికి భిన్నంగా, హీరో మోటోకార్ప్ సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే బైక్లలోనే ఈ పర్యావరణహిత టెక్నాలజీని అందించడం విశేషం. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన కొత్త స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.
పెట్రోల్తో పాటు అధిక శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించే సామర్థ్యం ఈ బైక్ల ప్రత్యేకత. దీంతో ఇంధన దిగుమతులపై దేశ ఆధారపడటం తగ్గడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో హీరో తీసుకున్న ఈ నిర్ణయం భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. వీటి ధరలు కూడా చాలా వరకు అందుబాటులోనే ఉన్నాయి.

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 82,710గా నిర్ణయించగా, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ ధర రూ. 72,792గా ప్రకటించారు. అధికారికంగా లాంచ్ చేసినప్పటికీ ఈ రెండు బైక్ల విక్రయాలు వచ్చే నెల జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే తొలి దశలో దేశవ్యాప్తంగా కాకుండా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రారంభంగా ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని కొన్ని కీలక మార్కెట్లలో ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్లను విక్రయించనున్నారు. అక్కడి వినియోగదారుల స్పందన, ఇంధన లభ్యత, మార్కెట్ పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలపై ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. స్వదేశీ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యాలతో ప్రభుత్వం కూడా ఈ టెక్నాలజీకి ప్రోత్సాహం అందిస్తోంది.

సాంకేతిక అంశాల విషయానికి వస్తే, హీరో ఈ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్లలో పూర్తిగా కొత్త ఇంజిన్ను ప్రవేశపెట్టకుండా, ఇప్పటికే వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన 97.2 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్కే ఆధునిక అప్గ్రేడ్లను అందించింది. ఈ ఇంజిన్ను 20 శాతం ఇథనాల్ (E20) నుంచి 85 శాతం ఇథనాల్ (E85) వరకు మిశ్రమం కలిగిన ఇంధనంపై సమర్థవంతంగా పనిచేసేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
ముఖ్యంగా ట్యాంక్లో నింపిన ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును స్వయంచాలకంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యం దీనికి ఉంది. దీంతో వినియోగదారులు వేర్వేరు ఇథనాల్ మిశ్రమాల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఈ ఇంజిన్ 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్ (E100)పై కూడా పనిచేయగల సామర్థ్యం కలిగి ఉందని హీరో మోటోకార్ప్ వెల్లడించింది.

పనితీరు పరంగా చూస్తే, E85 ఇంధనంతో నడుస్తున్నప్పుడు ఈ ఇంజిన్ 8,000 ఆర్పీఎం వద్ద 8.4 హెచ్పీ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 8.3 ఎన్ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేయడానికి హీరో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU)లో కీలక మార్పులు చేసింది. అధిక ఇథనాల్ శాతం కలిగిన ఇంధనాన్ని సులభంగా నిర్వహించేందుకు ఫ్యూయల్ సిస్టమ్లోని పలు భాగాలను కూడా అప్గ్రేడ్ చేసింది.
అయితే ఈ మార్పులు ప్రధానంగా ఇంధన వ్యవస్థకు మాత్రమే పరిమితమయ్యాయి. బైక్ల మెకానికల్ నిర్మాణం, చాసిస్ లేదా బాడీ డిజైన్లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. దీంతో స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ మోడళ్లకు ఉన్న సుపరిచితమైన రూపం అలాగే కొనసాగుతుంది. భద్రతా పరంగా కూడా హీరో ఎలాంటి రాజీ పడలేదు. రైడర్లకు అవసరమమైన ఫీచర్స్ కూడా అలాగే ఉన్నాయి.


Click it and Unblock the Notifications