రోడ్డు మీదకి వస్తే రాయల్ లుక్కే.. 30 రోజుల్లోనే లక్షలకు పైగా బైకులు అమ్మిన దేశీయ దిగ్గజం
భారతీయ బైక్ లవర్లకు రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) అంటే ఒక బ్రాండ్ మాత్రమే కాదు.. అదొక ఎమోషన్. బుల్లెట్ బైక్ పై రోడ్డు మీద వెళ్తుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఈ దేశీయ దిగ్గజ బైక్ తయారీ సంస్థ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. గత మే 2026 నెల రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి పండగ తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ ఒక్క నెలలోనే లక్షకు పైగా బైకులను విక్రయించి కంపెనీ సరికొత్త సంచలనం సృష్టించింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 15 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసి మార్కెట్లో తన హవాను చాటుకుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి తాజా విక్రయాల గణాంకాలే నిదర్శనం. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. మే 2026 నెలలో మొత్తం 1,03,231 మోటార్సైకిళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే 2025 నెలలో ఈ అమ్మకాల సంఖ్య 89,428 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి కంపెనీ ఏకంగా 15 శాతం వృద్ధిని సాధించి రికార్డు సృష్టించింది.

దేశీయ మార్కెట్ అయిన మన భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు మరింత అరాచకంగా సాగాయి. మే నెలలో దేశీయ మార్కెట్లోనే అత్యధికంగా 94,115 యూనిట్ల బైకులను కంపెనీ విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోల్చి చూస్తే.. ఈసారి దేశీయ అమ్మకాల్లో ఏకంగా 24 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం విశేషం. దీనిని బట్టి చూస్తే భారతీయుల్లో ఈ క్లాసిక్ బైకులపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని, పైగా రోజురోజుకూ పెరుగుతోందని అర్థమవుతోంది.
ఒకవైపు ఇండియాలో సేల్స్ కుమ్మేస్తున్నప్పటికీ, విదేశాలకు చేసే ఎగుమతుల్లో మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నెలలో కంపెనీ కేవలం 9,116 యూనిట్ల బైకులను మాత్రమే ఎగుమతి చేయగలిగింది. గతేడాది మే 2025 లో ఈ ఎగుమతుల సంఖ్య 13,609 యూనిట్లుగా ఉండేది. అంటే ఈ ఏడాది విదేశీ ఎగుమతుల్లో ఏకంగా 33 శాతం మేర భారీ తగ్గుదల కనిపించింది.

ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించడంలో రాయల్ ఎన్ఫీల్డ్ అస్సలు వెనకడుగు వేయడం లేదు. మే నెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో గొరిల్లా 450 ఎపెక్స్ (Gorilla 450 Apex) బైకును, అలాగే మలేషియా మార్కెట్లో గోవాన్ క్లాసిక్ 350 (Goan Classic 350) బైకును కంపెనీ గ్రాండ్గా లాంచ్ చేసింది. అంతేకాకుండా, వియత్నాంలోని హనోయ్ నగరంలో సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ను ప్రారంభించి, అక్కడ ఒకేసారి ఐదు రకాల మోటార్సైకిళ్లను మార్కెట్లోకి వదిలింది.
కంపెనీ సాధించిన ఈ భారీ విజయాలపై ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. మార్కెట్లో ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, 2026-27 ఆర్థిక సంవత్సరం (FY27) మొదటి త్రైమాసికంలో కంపెనీ తన పవర్ఫుల్ రన్నింగ్ను కొనసాగించిందని చెప్పారు. ముఖ్యంగా మే నెల కంపెనీ చరిత్రలో నిలిచిపోతుందని, ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ బైక్ బుల్లెట్ను సరికొత్త పవర్ఫుల్ అవతారంలో బుల్లెట్ 650 (Bullet 650) పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు.

బిజినెస్ పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. మన ఆంధ్రప్రదేశ్లోని తడ ప్రాంతంలో ఒక సరికొత్త గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ (Greenfield Manufacturing Plant)ను ఏర్పాటు చేయడానికి కంపెనీ స్థలాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం కంపెనీ ఏకంగా రూ. 2,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఈ కొత్త ప్లాంట్ అందుబాటులోకి వస్తే బైకుల ఉత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా, కంపెనీ నెక్స్ట్ లెవెల్ బిజినెస్కు ఇది పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.
బైక్ రైడింగ్, అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం కూడా ఈ నెల ఎంతో స్పెషల్గా మారింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన ఐకానిక్ హిమాలయన్ ఒడిస్సీ (Himalayan Odyssey) 22వ ఎడిషన్ కోసం రిజిస్ట్రేషన్లను అధికారికంగా ప్రారంభించింది. ఈ సారి రైడర్లకు మరింత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒరిజినల్, ఎక్స్ప్లోర్, కార్గిల్ సర్క్యూట్, నుబ్రా సర్క్యూట్ అనే నాలుగు వేర్వేరు ఫార్మాట్లలో ఈ జర్నీని డిజైన్ చేశారు. మరోవైపు, రేసింగ్ ప్రేమికుల కోసం కాంటినెంటల్ జీటి కప్ 2026 (Continental GT Cup 2026) ఆరో ఎడిషన్ సన్నాహాలు కూడా మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications