డుగ్ డుగ్ సౌండ్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.. అందరూ సెల్యూట్! ఫెరారీని దాటేసి చరిత్ర లిఖించిన రాయల్ ఎన్ఫీల్డ్
ఒకప్పుడు కేవలం భారత యువత గుండెల్లో మాత్రమే రాజ్యమేలిన రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగానికే తన శక్తిని చూపిస్తోంది. బుల్లెట్ శబ్దంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ భారతీయ దిగ్గజం తాజాగా ప్రపంచ స్థాయిలో మరో అద్భుతమైన ఘనతను అందుకుంది. స్పోర్ట్స్ కార్ల ప్రపంచంలో ప్రతిష్టాత్మక పేరుగా నిలిచిన ఫేరారీ (Ferrari)ని కూడా వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే మూడవ అత్యంత బలమైన ఆటోమొబైల్ బ్రాండ్గా అవతరించడం ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ బ్రాండ్లను వారి మార్కెట్ ప్రభావం, వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ విలువ, పనితీరు వంటి కీలక అంశాల ఆధారంగా అంచనా వేసే ప్రముఖ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ (Brand Finance) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
2026 బ్రాండ్ ఫైనాన్స్ ర్యాంకింగ్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ 100లో 88.6 స్కోరును సాధించి ప్రపంచ టాప్-3 ఆటోమొబైల్ బ్రాండ్ల జాబితాలో చోటు సంపాదించింది. ఈ జాబితాలో జపాన్ దిగ్గజం Toyota 92.5 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా, జర్మన్ లగ్జరీ బ్రాండ్ BMW 88.9 స్కోరుతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన భారీ లగ్జరీ బ్రాండ్ల మధ్య ఒక భారతీయ మోటార్సైకిల్ కంపెనీ మూడో స్థానంలో నిలవడం ఆశ్చర్యం.

ఇది కేవలం ఒక ర్యాంక్ మాత్రమే కాదు.. భారతీయ బ్రాండ్లు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తెలిపే పెద్ద సంకేతం. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేకమైన రెట్రో డిజైన్, బలమైన ఇంజిన్లు, ప్యూర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇమేజ్తో యూరప్, అమెరికా, ఆసియా మార్కెట్లలో వేగంగా అభిమానులను సంపాదిస్తోంది. ఒకప్పుడు భారత రోడ్లకే పరిమితమైన బుల్లెట్ బైక్లు ఇప్పుడు ప్రపంచ వీధుల్లో గర్జించడం వెనుక ఇదే అసలు కారణం.
ఇటీవల కంపెనీ విడుదల చేస్తున్న కొత్త తరం బైక్లు, అడ్వెంచర్ మోడళ్లు, 450 సిరీస్, గ్లోబల్ ఎక్స్పాంషన్ ప్లాన్లు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ విలువను భారీగా పెంచాయి. ఇప్పుడు చూస్తుంటే.. ఒకప్పుడు బుల్లెట్ అంటే కేవలం ఓ బైక్ అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు అదే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో భారత జెండాను ఎగురవేస్తున్న గ్లోబల్ ఐకాన్గా మారిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ జాబితాలో Tata Motors ఐదవ స్థానాన్ని దక్కించుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, భద్రతా ప్రమాణాలు, గ్లోబల్ డిజైన్లతో టాటా మోటార్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా తన బ్రాండ్ విలువను పెంచుకుంటోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో EV విప్లవానికి నాయకత్వం వహించడం ఈ కంపెనీకి భారీ బలంగా మారింది.
ఇక దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో నిలవడం మరో పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాల నమ్మకాన్ని సంపాదించిన ఈ బ్రాండ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, మంచి మైలేజీ, విశ్వసనీయతతో కోట్లాది వినియోగదారుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు అదే బ్రాండ్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ స్థాయికి చేరుకోవడం భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ,స్పోర్ట్స్ కార్లకు ప్రతీకగా భావించే Ferrari ఈసారి ఏడవ స్థానంలో నిలిచింది. ఇక మహీంద్రా ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకోగా, జర్మన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల దిగ్గజం Porsche తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అలాగే ప్రపంచంలోనే అమ్మకాల పరంగా అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన హీరో కూడా టాప్-10 జాబితాలో చోటు సంపాదించింది. పదవ స్థానాన్ని దక్కించుకుంది హీరో మోటోకార్ప్.


Click it and Unblock the Notifications