పేద-మధ్యతరగతికి దేవడి లాంటి కంపెనీ.. సుజుకి బ్రాండ్కు 20 ఏళ్లు.. ఇండియన్ మార్కెట్లో రారాజు
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన సుజుకి (Suzuki), గత రెండు దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ తన స్థానాన్ని బలపరచుకుంది. జపాన్కు చెందిన ఈ బ్రాండ్ 2006లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి, నాణ్యత, పనితీరు, ఇంధన సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఈ కంపెనీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రారంభ దశలోనే కంపెనీ Suzuki Heat 125, Suzuki GS 125 వంటి మోడళ్లను ప్రవేశపెట్టి, భారత వినియోగదారులకు తన ఉత్పత్తులను పరిచయం చేసింది. అయితే, నిజమైన మలుపు ఒక్క సంవత్సరానికే వచ్చింది. సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) విడుదలతో సుజుకి భారత మార్కెట్లో మరింత బలంగా స్థిరపడింది. ఈ స్కూటర్ తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో త్వరగా ప్రజాదరణ పొందింది.
కాలక్రమేణా, యాక్సెస్ 125 దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా మారింది. కాలానికి అనుగుణంగా మార్పులు చేస్తూ, సుజుకి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. ఇటీవల కంపెనీ సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ రూపంలో యాక్సెస్ స్కూటర్కు ఎలక్ట్రిక్ వెర్షన్ను పరిచయం చేసింది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ మార్కెట్ను లక్ష్యంగా పెట్టుకున్నదిగా కనిపిస్తోంది.

ఇక్కడితో ఆగకుండా, సుజుకి మరొక కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే యాక్సెస్ స్కూటర్కు సిఎన్జీ వెర్షన్ను కూడా భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇది అమలు అయితే, ఇంధన వ్యయాన్ని మరింత తగ్గించాలనుకునే వినియోగదారులకు ఇది ఒక కొత్త ఎంపికగా మారవచ్చు. మారుతున్న ట్రెండ్లకు అనుగుణంగా ముందుకు సాగడం ఈ బ్రాండ్ విజయానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
Suzuki భారత మార్కెట్లో కేవలం యాక్సెస్ స్కూటర్తోనే కాకుండా, విభిన్న సెగ్మెంట్లలో తన ఉనికిని బలపరుస్తోంది. స్కూటర్ సెగ్మెంట్లో Access 125 భారీ విజయాన్ని సాధిస్తుండగా, బైక్ సెగ్మెంట్లో కూడా కంపెనీ మంచి స్థాయిలో పోటీ ఇస్తోంది. ముఖ్యంగా Gixxer 150, Gixxer 250 శ్రేణి బైక్లు యువతలో మంచి క్రేజ్ను సంపాదించాయి. ఇప్పుడు ఈ మోడళ్లకు మరిన్ని అప్డేట్లు రానున్నాయని సమాచారం, ఇది మార్కెట్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇక ప్రీమియం, భారీ బైక్ల విభాగంలో, హయబుసా పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సూపర్బైక్ భారత మార్కెట్లో సుజుకి బ్రాండ్కు ఒక ఐకాన్లా మారింది. అమ్మకాల పరంగా కూడా ఇది అగ్రస్థానంలో కొనసాగుతూ, హై-ఎండ్ బైక్ కొనాలనుకునే వారికి మొదటి ఎంపికగా నిలుస్తోంది. అదేవిధంగా, స్కూటర్ సెగ్మెంట్లో కూడా సుజుకి తన ఆఫర్లను నవీకరిస్తూనే ఉంది.
ఇటీవల Suzuki Burgman Street కొత్త వెర్షన్ను విడుదల చేసి, కీలెస్ ఇగ్నిషన్, TFT డిస్ప్లే వంటి ఆధునిక ఫీచర్లను జోడించింది. ఇది ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. భవిష్యత్ ప్రణాళికల విషయానికి వస్తే, సుజుకి భారత్లో తన తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని ఖర్ఖోడా ప్రాంతంలో రెండవ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో కంపెనీకి మరింత బలం చేకూరనుంది. Suzuki భారత మార్కెట్లో తన ప్రయాణాన్ని క్రమంగా విస్తరించుకుంటూ, ప్రతి దశలో ఒక కీలక మైలురాయిని అందుకుంది. 2012లో మొదటిసారి 10 లక్షల మంది వినియోగదారుల గణాంకాన్ని దాటిన ఈ బ్రాండ్, కేవలం ఎనిమిదేళ్లలోనే 2020 నాటికి 50 లక్షల కస్టమర్ల స్థాయికి చేరుకుంది.
ఇదే జోరు కొనసాగిస్తూ, 2026 నాటికి సుజుకి 100 లక్షల మంది వినియోగదారుల భారీ మైలురాయిని చేరుకోవడం మరింత విశేషం. ఇక సుజుకి భారత్కు ఉన్న ప్రాధాన్యతను చూస్తే, ఇది కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, ముఖ్యమైన తయారీ కేంద్రం కూడా. భారతదేశంలో తయారు చేసిన ద్విచక్ర వాహనాలను దేశీయంగా విక్రయించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 77 దేశాలకు ఎగుమతి చేస్తోంది.


Click it and Unblock the Notifications