సమ్మె విరమించకపోతే ప్లాంటును తరలించేస్తాం: రాజీవ్ బజాజ్
గడచిన జూన్ 25న పూనేలోని బజాజ్ ఆటోకు చెందిన ఛాకన్ ప్లాంట్లో సమ్మె ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సమ్మెను విరమింపజేసేందుకు కార్మికులతో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య జరుగుతున్న చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి. ప్రస్తుతం అతికొద్ది మంది వర్కర్లు మాత్రమే ప్లాంటులో పనిచేస్తున్నారు. మెజారిటీ వర్కర్లు విధులను బహిష్కరించి సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు.
నిరవధిక సమ్మె కారణంగా ఛాకన్ ప్లాంటులో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నిరకాల బజాజ్ మోటార్సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో, మరొక వారం సమయంలో ఛాకన్ ప్లాంటులోని కార్మికులు సమ్మె విరమించి తిరిగి విధుల్లోకి రాకుంటే, ప్లాంట్ను ఛాకన్ ప్లాంట్ నుంచి వేరే ప్రాంతానికి తరలించేస్తామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అల్టిమేటం జారీ చేశారు.
'వారం లోపుగా ఈ సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే, కనీసం 50 శాతం ఉత్పత్తిని, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఔరంగాబాద్, పాంట్నగర్ ప్లాంట్లకు తరలించేస్తామ'ని రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ఇదే గనుక జరిగితే ఛాకన్ ప్లాంటులో దాదాపు 50 శాతం మంది శాశ్వతంగా ఉపాధి కోల్పోయే ఆస్కారం ఉంది.

ఛాకన్ ప్లాంటులో 925 మంది శాస్వత కార్మికులు పనిచేస్తుండగా, 1000 మంది తాత్కాలిక, కాంట్రాక్ట్, ట్రైనీ వర్కర్లు పనిచేస్తున్నారు. ఈ 1000 మంది వర్కర్లు కూడా తమ పర్మినెంట్ చేయాలని, జీతాలను సవరించాలని, వర్కర్లకు కంపెనీ షేర్లలో వాటాలు ఇవ్వాలని కార్మిక సంఘం డిమాండ్ చేస్తోంది. 25 శాతం వేతనాలను పెంచడంతో పాటు తాత్కాలిక, కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని కోరుతుంది.
అంతేకాకుండా, సస్పెండ్ చేసిన కొంత మంది ఉద్యోగులను మరియు ఛాకన్ ప్లాంటు నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఉద్యోగులను తిరిగి ఇదే ప్లాంటుకు పిలిపించాలని కూడా సదరు యూనియన్ డిమాండ్ చేస్తోంది. ఛాకన్ ప్లాంటులో ఏటా 12 లక్షల మోటార్సైకిళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్లాంటులో పల్సర్, అవెంజర్, నిన్జా, కెటిమ్ బ్రాండ్ మోటార్సైకిళ్లు ఉత్పత్తి అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








