ఢిల్లీలో మహిళా రైడర్లకు హెల్మెట్ తప్పనిసరి
దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలను నడిపే మహిళా రైడర్లు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఎవ్వరూ అడిగేవారు లేరు. కానీ, ఇకనుంచి ఆ పరిస్థితి మారనుంది, ఎందుకంటే ఇకపై మహిళా రైడర్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
ఢిల్లీ రోడ్లపై హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలకు గురై మరిణించే/గాయపడే మహిళా రైడర్ల సంఖ్య నానాటికీ ఎక్కువ అవుతున్న కారణంగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఢిల్లీ నగర వీధుల్లో ద్విచక్ర వాహనంపై సంచరించే మహిళలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపే మహిళా రైడర్లపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. మోటార్ వాహన చట్టంలోని రూల్ 115ను సవరించాలనే ప్రతిపాదనను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తెరపైకి తీసుకువచ్చింది.

ఇదివరకు ఈ రూల్ ప్రకారం, మహిళా రైడర్లకు హెల్మెట్ ధరించడం నుంచి మినహాయింపు లభించేంది. తాజా ప్రతిపాదన ప్రకారం, ఇకపై వారు (మహిళలు) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది, ఇందుకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించగానే మరో రెండు మూడు నెలల్లో దీనిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.
గడచిన రెండేళ్లలో గమనిస్తే, రోడ్డుపై ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదలకు గురైన మహిళల సంఖ్య పెరగటమే ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణం. అధికారిక లెక్కల ప్రకారం, 2012లో 42 మంది మహిళా రైడర్లు చనిపోగా, 2013లో ఆ సంఖ్య 63కి పెరిగింది. దీనిబట్టి చూస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది.


Click it and Unblock the Notifications








