హీరో మోటోకార్ప్ 6వ ప్లాంట్ తెలంగాణాకేనా..?
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ 6వ ప్లాంట్ను దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించడంతో, ఆ ప్లాంట్ను సొంతం చేసుకునేందుకు దక్షణ భారతదేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రం మరియు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పోటీగా ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసినదే.
వాస్తవానికి హీరో మోటోకార్ప్ ప్లాంట్ ఏర్పాటుకు కావల్సిన అన్ని సదుపాయాలు ఇరు రాష్ట్రాలలో ఉన్నాయి. అయితే, హీరో మోటోకార్ప్ మాత్రం తమ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణా (హైదరాబాద్) రాష్ట్రానే ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సమీపంలోని జహీరాబాద్లో కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేయటానికి హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే హీరో మోటోకార్ప్కు చెందిన కొందరు ఉన్నతాధికారుల బృంద తమ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని జహీరాబాద్లో పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ బృందం ఎంపిక చేసిన స్థలాలను మరో బృందం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరో వైపు హీరో మోటోకార్ప్ ప్లాంట్ ఏర్పాటుకు కావల్సినంత స్థలాన్ని ఇచ్చేందుకు తెలంగాణా సర్కారు కూడా సిద్ధంగా ఉందట.
ఇటీవలే మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో తమ ట్రాక్టర్ల ప్లాంట్ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ కూడా దాదాపు హైదరాబాద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ భారతంలో ఏర్పాటు చేయబోయే ఆరవ ప్లాంట్ సాయంతో కంపెనీ తమ మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 1.2 కోట్ల యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








