అన్ని టూవీలర్స్ ధరలను పెంచిన హీరో మోటోకార్ప్
పండుగ సీజన్లో అమ్మకాల సెంటిమెంట్ జోరుగా ఉంటుందన్న సంగతి తెలిసినదే. ప్రత్యేకించి దీపావళికి ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు కొన్ని కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటే, మరికొన్ని కంపెనీలు మాత్రం తమ ఉత్పత్తులను ధరలను పెంచేస్తున్నాయి.
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ అన్ని ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఇన్పుట్ ధరలను తట్టుకునేందుకే అన్ని మోటార్సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నామని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఈ పెంపు కేవలం మార్జినల్ మాత్రమేనని, ఇది 0.5 శాతం ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ ధరల పెంపు కేవలం 0.5 శాతం మాత్రమే అయిన నేపథ్యంలో, ఈ పెంపు హీరో మోటార్సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలపై పెద్ద ప్రభావం చూపబోదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన సెప్టెంబర్ నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి, 6 లక్షలకు పైగా ద్విచక్ర వహనాలను విక్రయించింది.
కాగా.. ఈనెల పండుగ సీజన్ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ పండుగ సీజన్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేందుకు హీరో మోటోకార్ప్ ఇటీవలే రెండు కొత్త మోటార్సైకిళ్లను (స్ప్లెండర్ ప్రో క్లాసిక్, ప్యాషన్ ప్రో టిఆర్) కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








