ఏప్రిల్-మార్చ్ నాటికి మార్కెట్లోకి రానున్న మహీంద్రా మోజో
మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూ వీలర్స్, గత కొంత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్న 300సీసీ బైక్ మోజో విడుదలను ఈ ఏడాది ఖరారు చేయనుంది. గడచిన 2010లో తొలిసారిగా ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచిన మహీంద్రా మోజో ప్రీమియం మోటార్సైకిల్ ఇప్పటి వరకూ మార్కెట్ను తాకలేకపోయింది.
మహీంద్రా మోజో ప్రోటోటైప్ మొదలుకొని ఇప్పటి వరకు దీని డిజైన్ను పలుమార్లు మారుస్తూ వచ్చారు. కస్టమర్ల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా కొత్త డిజైన్తో మోజోను తీసుకొస్తున్నట్టు కంపెనీ సేల్స్, కస్టమర్కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర మార్కెట్లలో మహీంద్రా గస్టో స్కూటర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
మోజో 300సీసీ ప్రీమియం మోటార్సైకిల్ను ఈ ఏడాది ఏప్రిల్-మార్చ్ నెల నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. మహీంద్రా టూవీలర్స్ ఇప్పటికే మోజో బైక్ను పూనే రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ టెస్టింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో (రెగ్యులర్, స్పోర్ట్) లభ్యం కానున్నట్లు సమాచారం.

మహీంద్రా మోజో బైక్లో 295సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్పిల శక్తిని, 25 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్ట్ వేరియంట్ కొంచెం ఎక్కువ పెర్ఫామెన్స్ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్బాక్స్తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
మహీంద్రా మోజో బైక్లో పెటల్ స్టైల్ డిస్క్ బ్రేక్స్, రేడియల్ టైర్స్, అప్సైడ్ డౌన్ ఫోర్క్స్, పీరెల్లీ డెమోన్ టైర్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇంకా డిజిటల్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్ కాంబినేషన్తో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications