ప్యూజో స్కూటర్ విభాగంపై కన్నేసిన మహీంద్రా
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్), కైనెటిక్ టూవీలర్ విభాగాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతి ద్విచక్ర వాహన విభాగంలో మహీంద్రా టూవీలర్స్ పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం మహీంద్రా టూవీలర్స్ కైనటిక్ ఉత్పత్తులన్నింటినీ అప్గ్రేడ్ చేసి తమ స్వంత బ్రాండింగ్తో విక్రయిస్తోంది.
అయితే, ఇప్పుడు మహీంద్రా గ్రూప్ ఫ్రాన్స్కు చెందిన మరో ద్విచక్ర వాహన సంస్థను తమలో కలుపునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫ్రాన్స్కి చెందిన ఆటోమొబైల్ కంపెనీ పిఎస్ఏ ప్యూజో సిట్రాన్కు చెందిన స్కూటర్ యూనిట్ను దక్కించుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సన్నద్దమవుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ స్కూటర్ యూనిట్ను కొనుగోలు చేసేందుకు గాను ప్యూజో సిట్రాన్ సంస్థతో మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్యూజోను చేజిక్కించుకోవటం ద్వారా భారత టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వంటి సంస్థలకు గట్టి పోటీని ఇవ్వొచ్చని మహీంద్రా అంచనా వేస్తోంది.

అయితే, ఈ డీల్ గురించి మాట్లాడేందుకు మాత్రం మహీంద్రా అధికారులు నిరాకరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ, అతి త్వరలోనే ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్యూజో యూరప్లో కెల్లా రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా ఉంది. కానీ, ఈ సంస్థకు చెందిన స్కూటర్ వ్యాపారం మాత్రం గడచిన దశాబ్ద కాలంగా నష్టాల్లో సాగుతోంది. గడచిన సంవత్సరంలో ప్యూజో కేవలం 79,000 ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది.


Click it and Unblock the Notifications








