భారత మార్కెట్లోకి ప్రవేశించిన జపనీస్ 'టెర్రా మోటార్స్'
జపాన్లో నెంబర్ వన్ అయిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ ఈ ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ తొలి ఉత్పత్తిని మంగళవారం నాడు న్యూఢిల్లీలో విడుదల చేసింది.
టెర్రా మోటార్స్ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సూపర్బైక్ను ఇండియాలో విడుదల చేసింది. 'టెర్రా కివామీ' (Terra Kiwami) పేరుతో ఈ 1000సీసీ ఎలక్ట్రిక్ సూపర్బైక్ను కంపెనీ ప్రవేశపెట్టింది. భారత్లో ఇదే మొట్టమొదటి 1000సీసీ ఎలక్ట్రిక్ సూపర్బైక్ కావటం విశేషం. జపనీస్ భాషలో కివామీ అంటే అల్టిమేట్ అని అర్థం.
ప్రత్యేకించి యువతను మరియు బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని ఈ బైక్ను ప్రవేశపెట్టారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యమ్నాయ ఇంధనం మరియు ప్రకృతి సాన్నిహిత్యమైన వాహనాలను కోరుకునే వారికి కూడా తమ కివామీ చక్కగా సూట్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

టెర్రా కివామీ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కేవలం ఆరు గంటల చార్జింగ్తో దీనిపై 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దేశీయ విపణిలో దీని ధర సుమారు రూ.18 లక్షలు ఉండొచ్చని అంచనా.
టెర్రా కివామీతో పాటుగా కంపెనీ మరిన్ని ఉత్పత్తులను భారత్కు పరిచయం చేయనుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ ఈ-స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ కూడా ఉండనున్నాయి. టెర్రా మోటార్స్ తమ ఉత్పత్తుల శ్రేణిలో ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications








