రోడ్ సేఫ్టీ ప్రమోషన్ కోసం యమహా బ్రాండ్ మస్కట్ విడుదల
ఎప్పుడూ రొటీన్గా మోటార్సైకిళ్లు, స్కూటర్లను ఏం విడుదల చేస్తాంలే అనుకుందో ఏమో, జపనీస్ మోటార్సైకిల్ బ్రాండ్ యమహా ఈసారి కొంచెం కొత్తగా ఓ వినూత్న ప్రచారానికి తెరలేపింది. జనవరిలో కొత్త ఉత్పత్తిని విడుదల చేస్తామని ప్రకటించిన యమహా, తమ కొత్త బ్రాండ్ మస్కట్ను విడుదదల చేసింది.
రహదారి ప్రయాణ భద్రతపై చిన్నారులలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటుగా వారి తల్లిదండ్రులను కూడా చైతన్య పరచేందుకు మొట్టమొదటిసారిగా 'యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్'ను నిర్వహిస్తున్నట్లు యమహా మోటార్ ఇండియా సేల్స్ (వైఎమ్ఐఎస్) ఓ ప్రకటనలో వెల్లడించంది. ఈ కార్యక్రమ ప్రచారం కోసమే తమ బ్రాండ్ మస్కట్ను ఆవిష్కరించినట్లు కంపెనీ పేర్కొంది.

యమహా తమ బ్రాండ్ మస్కట్కు ఇంకా ఎలాంటి పేరును పెట్టలేదు. దీనికి పేరు పెట్టేందుకు గాను ఈ నెల 27 వరకు బాలల కోసం ఓ ప్రత్యేక పోటీని నిర్వహించనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ పోటీలో పాల్గొనదలచిన 5 నుంచి 12 ఏళ్ల లోపు బాలలు తమ తల్లిదండ్రుల సాయంతో సమీపంలోని యమహా డీలర్ల వద్ద పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని, ఇందులో గెలుపొందిన విజేతల వివరాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి స్కాలర్షిప్తో పాటుగా, వివిధ ఆకర్షనీయమైన బహుమతులను అందజేస్తారు.
ఈ చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్ కోసం యమహా 12 మంది ట్రైనర్లను నియమించింది. వీరంతా జపాన్లోని యమహా మోటార్ కంపెనీలో ప్రత్యేక శిక్షణ పొందిన వారు. ఈ కార్యక్రమంలో భాగంగా, యమహా బ్రాండ్ మస్కట్ చిన్న పిల్లల స్కూళ్లను సందర్శిస్తుంది. ఈ సందర్భంగా, యమహా ప్రత్యేక హెల్మెట్లను కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








