యమహా నుంచి ఓ సరికొత్త 125సీసీ బైక్!
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త 125సీసీ స్కూటర్ను అభివృద్ధి చేస్తోంది. భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో, కంపెనీ తమ స్కూటర్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని విస్తరించుకోవాలని యోచిస్తోంది.
యమహా ఇండియా ఇప్పటికే రే, రే జెడ్, ఆల్ఫా అనే మూడు స్కూటర్లను దేశీయ విపణిలో విక్రయిస్తోంది. తాజాగా ఓ సరికొత్త 125సీసీ స్కూటర్ను భారత్లో విడుదల చేసేందుకు యమహా సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఈ కొత్త యమహా స్కూటర్ ఇండియాకు రానుంది.

చెన్నైలోని యమహా ప్లాంట్లో ఈ కొత్త స్కూటర్ను ఉత్పత్తి చేయనున్నారు. యమహా విక్రయిస్తున్న రే, రే జెడ్, ఆల్ఫా స్కూటర్లలో 113సీసీ ఇంజన్ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, యమహా ఈ మూడు స్కూటర్ల కన్నా మరింత శక్తివంతమైన 125సీసీ స్కూటర్ను విడుదల చేయనుంది.
యమహా ఇటీవలే వియత్నాం మార్కెట్ కోసం నోజా గ్రాండే అనే 125సీసీ స్కూటర్ను విడుదల చేసింది. ఇందులో 125సీసీ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ను ఉపయోగించారు. ఫలితంగా ఇది సుపీరియర్ పెర్ఫార్మెన్స్ మరియు మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ మోడల్ను ఆసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని యమహా అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో, ఇలాంటి స్కూటర్నే కంపెనీ ఇండియాలోను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2014 ఆటో ఎక్స్పోలో యమహా పలు స్కూటర్లను ప్రదర్శనకు ఉంచింది. యమహాకు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విస్తృతస్థాయిలో స్కూటర్ మోడళ్లున్నాయి. వాటిలో ఏ మోడల్నైనా కంపెనీ ఇండియాకు తీసుకు వచ్చే ఆస్కారం ఉంది. ఎక్స్-మ్యాక్స్ 125 లేదా బిడబ్ల్యూ 125 మోడళ్లను ఇండియాకు తీసుకువస్తే, వీటికి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ద్విచక్ర వాహన వినియోగదారులు మోటార్సైకిళ్ల కన్నా స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో, టూవీలర్ కంపెనీలు ఆ దిశగా కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా స్కూటర్లను డిజైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం స్కూటర్ మార్కెట్లో హోండా అగ్రగామిగా ఉండగా, సుజుకి, మహీంద్రా, పియాజ్జియో, హీరో వంటి కంపెనీలు కూడా చక్కటి స్కూటర్లను ఆఫర్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








