EV Scooter Booking ఆన్లైన్లో ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త దొంగలున్నారు..!
ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో పప్పుల దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్స్ వరకు అన్ని ఆన్ లైన్ అంగట్లో దొరుకుతున్నాయి. ఆయా సంస్థలకు చెందిన వెబ్ సైట్ ల ద్వారా సులభంగా ఇంట్లోనే ఉండి ఆర్డర్ చేయవచ్చు. ఇలాంటి వాటిని కొందరు సైబర్ నేరగాళ్లు వమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఇలాంటి వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఇప్పటివరకు లేని విధంగా ఓ వ్యక్తి చేసిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
నేడు రోజువారి జీవన విధానంలో ద్విచక్ర వాహనం అనేది తప్పనిసరి అయ్యింది. ఇంట్లో నుంచి కాలు బయట తీసి అడుగు పెట్టాలంటే కచ్చితంగా వీటి అవసరం ఉంటుంది. అందువల్లే జీవితంలో ద్విచక్ర వాహనం కొనాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రస్తుతం చమురు ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుంది. అదిరిపోయే ఫీచర్లతో పలు కంపెనీలు ఆన్ లైన్ ద్వారా వాహనాలను విక్రయిస్తున్నాయి.

అయితే ఈ ఆన్ లైన్ కొనుగోళ్లను కొందరు మోసగాళ్లు పెట్టుబడిగా పెట్టుకుని అమాయక కస్టమర్లను మోసం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ డీలర్ షిప్ పేరిట తక్కువ ధరలో స్కూటర్ల అందుబాటులో ఉన్నాయని ప్రకటన ద్వారా మోసం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ డీలర్గా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న రాజేంద్ర శర్మ పాండా అనే 25 ఏళ్ల యువకుడిని ఇటీవల మహారాష్ట్రలోని థానేలో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయక కొనుగోలుదారులకు అనుమానం రాకుండా ఇతను చాక చక్యంగ వ్యవహరించేవాడు. దానిని ఆసరాగా చేసుకుని ఆన్ లైన్ లో ఎర చూపి మోసం చేసేవాడు.
మహారాష్ట్రలోని థానేలోని డోంబివాలికి చెందిన రాజేంద్ర శర్మ ఓలా ఎలక్ట్రిక్ స్కూటీ డీలర్గా నటిస్తున్నాడు. గూగుల్లో నకిలీ ప్రకటనలు సృష్టించి పలువురిని మోసం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ద్వారకా సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకోవడంలో సఫలమైంది.
కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఫిర్యాదుదారు గూగుల్లో ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్నారు. ఆ సమయంలో ఓలా స్కూటర్ నకిలీ ప్రకటన చూసి ఆశ్చర్యపోయి అందులోని ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. అప్పుడు స్కామర్ రాజేంద్ర శర్మ పరిచయం అయ్యాడు. బుకింగ్ కు అడ్వాన్స్ పేమెంట్ గా రూ.499 చెల్లించాలని కోరారు.
ఫిర్యాదుదారుడు ముందస్తు విచారణ లేకుండానే డబ్బులు కూడా డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత ఓలా స్కూటర్ను వారం రోజుల్లో డెలివరీ చేయనున్నారు. అందుకు రూ.80,999 చెల్లించాలని కోరగా, డిపాజిట్ చేసిన ఫిర్యాదుదారుడు చెల్లించిన సొమ్ముకు రశీదు ఇవ్వాలని కోరారు.
అనంతరం నిందితుడు రాజేంద్ర రూ.20వేలు అదనంగా డిమాండ్ చేసి ఫోన్ స్విచాఫ్ చేశాడు. నిందితుడి బ్యాంకు ఖాతా ద్వారా చిరునామాను గుర్తించారు. అయితే మోసగాడు తప్పుడు చిరునామా ఇవ్వడంతో, మొబైల్ సిగ్నల్ ద్వారా నిందితుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఓలా స్కూటర్ను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు కంపెనీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత డీలర్షిప్ను నేరుగా సంప్రదించవచ్చు. అలాగే, ఇలాంటి ప్రకటనలను చూసి మోసపోవద్దు అని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి యాడ్ లు చూస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని వారు కోరారు.


Click it and Unblock the Notifications








