‘నాకు ఈ పెట్రోల్ కష్టాలు లేవు'.. ఎలక్ట్రిక్ స్కూటర్తో పెట్రోల్ బంకులో యువకుడు ట్రోలింగ్.. వైరల్ వీడియో
పెట్రోల్ బంకుకు ఓ యువకుడు ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకువచ్చి ఇతర వాహనాదారులను సరదాగా ట్రోల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె నేపథ్యంలో గత రెండు రోజుల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. పెట్రోల్ నింపుకోవడం కోసం వాహనదారులు పడిగాపులు కాశారు. దీంతో హ్యాపియెస్ పర్సన్ ఎలక్ట్రిక్ ఓనర్ అంటూ వీడియోను పోస్ట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత(Bharatiya Nyaya Sanhitha 2023).. దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించింది. ఈ చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు(Hit And Run Cases) వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.. ఫలితంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్తో పెట్రోల్ స్టాక్ కొరత ఏర్పడింది.

ఈ క్రమంలో బుధవారం(జనవరి 3) ఓ పెట్రోల్ బంకులో టూ వీలర్లు, ఇతర వాహనదారులు క్యూ కట్టారు. తమ వంతు కోసం ఎదురుచూస్తుండగా.. ఓ వ్యక్తి ఓలా S1 ప్రో(Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లో పెట్రోల్ బంకుకు వచ్చాడు. ఇతనికి ఇక్కడేం పని అని అందరూ అతడిని వింతగా చూస్తుండగా.. ఆ యువకుడు స్కూటర్ దిగి కాసేపు పోజులు కొట్టాడు.
కళ్లజోడు పెట్టుకుని పెట్రోల్ బంకులో స్టైలిష్గా పోజులిస్తూ ఇతర వాహనదారులను ఆటపట్టిస్తున్నాడు. దీంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఐసీఈ వాహనాలపై ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ రివేంజ్ అంటూ పోస్ట్లో పేర్కొన్నారు. సంతోషకరమైన వ్యక్తి.. ఎలక్ట్రిక్ ఓనర్ అంటూ వీడియోపై పేర్కొన్నారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన వద్ద ఎలక్ట్రిక్ వాహనం ఉందని.. ఇలా పెట్రోల్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం తనకు లేదంటూ ఆ యువకుడు ట్రోల్ చేయడం నవ్వు తెప్పిస్తుంది. ఈ సంఘటన ద్వారా ఇలాంటి కఠిన సమయాల్లో ఎలక్ట్రిక్ వాహనం అవసరం ఎంతమేర ఉంటుందో మనకు తెలుస్తుంది.
నిజానికి మనం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కలిగి ఉంటే పెట్రోల్ సంక్షోభం నుండి మాత్రమే కాకుండా పెరుగుతున్న ఇంధన ధరల నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. అంతే కాదు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. భారతదేశంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాలను దశలవారీగా నిలిపివేయాలనే లక్ష్యంతో ఓలా ఎలక్ట్రిక్ విడుదల చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఇది.

భారత మార్కెట్లో ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధర రూ. 1.40 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఈ స్కూటర్ పూర్తి ఛార్జింగ్ పై 200 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో 7-అంగుళాల టచ్స్క్రీన్తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.
Ola S1 ప్రో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. ఇది కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన ఇ-స్కూటర్ కూడా విశేషం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని దానిని పెట్రోల్ ట్యాంక్లో ఉంచి చూపించాడు. లారీ డ్రైవర్ల సమ్మెతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
కాగా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ఈ కొత్త నిబంధన ఏం చెబుతుందంటే రోడ్డు ప్రమాదాలకు కారణం అయిన డ్రైవర్లు ఘటన గురించి పోలీసులకు లేదా మేజిస్ట్రేట్కు కచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వకుండా ఘటన స్థలం నుంచి పారిపోతే ఈ నిబంధన కింద గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు చట్టంలో పేర్కొంది.
ఈ నిబంధనతో బస్సు, ట్యాంకర్ డ్రైవర్ల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా పలుచోట్ల ఇంధన కొరత నెలకొంది. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కట్టిన సంగతి తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపడంతో.. తాత్కాలికంగా సమ్మెను విరమించారు.


Click it and Unblock the Notifications








