ట్రాఫిక్ను తప్పించేందుకు టూరిస్ట్ సాహసం.. ఏకంగా నదిలో నుంచే మహీంద్రా థార్ను నడిపిన వ్యక్తి, వైరల్ వీడియో
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వారాంతపు సెలవులు రావడంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలకు జనం తాకిడి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హిమాచల్ప్రదేశ్కు పర్యాటక ప్రియులు పోటెత్తుతున్నారు. రోడ్డుపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది. దీంతో ఓ వ్యక్తి ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకే కారును పోనిచ్చిన సంఘటన చోటుచేసుకుంది.
భారత్లో ప్రముఖ సుందర పర్యాటక ప్రాంతం హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)కు శీతాకాలం సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచుతో కూరుకుపోయిన పర్వతాల అందాలను ఆస్వాదించేందుకు కొత్త జంటలు, స్నేహితులు క్యూలు కడుతుంటారు. దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రతరంగా మారిపోయింది. పోలీసులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డుపై వరుసగా కార్లు బారులు తీరుతున్నాయి.

హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ వ్యాలీ చంద్రా నదిలో ఓ వ్యక్తి మహీంద్రా థార్ ఎస్యూవీ (Mahindra Thar SUV) వాహనాన్ని నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై తీవ్రంగా ట్రాఫిక్ ఉండటంతో ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో నదిలో నీరు పెద్దగా లేకపోవడంతో ప్రమాదం జరగలేదు.
అయితే మహీంద్రా థార్ ఎస్యూవీ డ్రైవర్ నిర్లక్ష్య పూరిత వైఖరి(Owner Drives Car In River)పై అక్కడి స్థానికులతో పాటు పర్యాటకుల నుంచి నెట్టింట్లో విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి చేరింది. పోలీసులు మహీంద్రా థార్ డ్రైవర్పై మోటార్ వాహనాల చట్టం-1988 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్కు భారీగా జరిమానా విధించినట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ ఆఫ్ రోడ్ వాహనం అయినప్పటికీ ఇలా నదిలో డ్రైవ్ చేయడం చట్ట విరుద్ధం. అక్కడ నది ప్రవాహం తక్కువగా ఉంది కాబట్టి ఏ ప్రమాదం జరగలేదు. లేదంటే కారు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సాహసాలు సాధారణంగా మనం సినిమాల్లోనే చూస్తాం. కానీ ఇలా నిజ జీవితంలో చూడటం ఇదే తొలిసారి. అందుకే ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
కాగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలా వరుస పండుగలతో పాటు వారాంతం కావడంతో గత నాలుగు రోజులుగా హిమాచల్ ప్రదేశ్కు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దీంతో లాహౌల్ నుంచి మనాలి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొనడంతో.. మనాలి, కాసోల్, సిమ్లా సహా పలు ప్రదేశాల్లోనూ పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందమైన మంచు కొండ ప్రాంతాల్లో పండుగ సెలవుల్ని ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులకు అక్కడి ట్రాఫిక్ పరిస్థితి అడ్డంకిగా మారింది.

అంతే కాకుండా జాతీయ రహదారులపై టోల్ బూత్ల వద్ద గంటల కొద్దీ వాహనాల్ని నిలపలేక జనం అవస్థలు పడ్డారు. కాగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రోహ్తంగ్లోని అటల్ సొరంగం (Atal tunnel) కులు, లాహౌల్, స్పితిలను కలుపుతూ పోతుంది. మూడు రోజుల్లోనే 55,000 కంటే ఎక్కువ వాహనాలు ఈ మార్గం గుండా సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల వ్యవధిలోనే 28,210 వాహనాలు అటల్ కెనాల్ను దాటినట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు పొగమంచు, మరోవైపు వేల సంఖ్యలో పర్యాటకుల రావడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించినట్లు పేర్కొన్నారు.
జాతీయ రహదారిపైన అటల్ టన్నెల్ నుంచి మనాలి వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. కనీసం పార్కింగ్కు అవకాశం లేకుండా ఉందని పర్యాటకులు నిరాశ చెందారు. జనం ఎక్కువ కావడంతో లాహౌల్, స్పితి జిల్లాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముండటంతో పర్యాటకుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసులు డ్రోన్ సహాయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications








